అవార్డులు ఎంపికచేసే ప్రక్రియ, జ్యూరీల నియామకం, సినిమాల ఎంపిక, తెలంగాణ సమాజాన్ని నిరాశ పరిచాయి. విశ్లేషించి చూస్తే అన్నీ తప్పుల తడకలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పున:సమీక్ష చేయకపోతే అవి చెరపలేని మచ్చల్లా మిగిలి పోతాయి. అధికార యంత్రాంగం అవగాహనా రాహిత్యాన్ని, ప్రభుత్వ పెద్దల పట్ల ప్రజల్లో పలు అనుమానాలకు దారితీస్తాయి. ఎందుకంటే, గద్దర్ పేరు సినిమాలో అన్నీ విభాగాలకు పెట్టడమే పెద్ద పొరపాటని మొన్నటి అవార్డుల ఫంక్షన్తో తేలిపోయింది. ”పుష్ప2” సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించిన పాత్ర ధారికి అవార్డు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం యువతకు ఏ సంకేతం ఇద్దామనుకుంటున్నది? ఇది అక్రమాలను, దుర్మార్గాలను, అవినీతి చర్యల్ని ప్రేరేపిస్తున్నట్లు కాదా? బాధ్యతాయుతమైన పోలీస్ వ్యవస్థను కించపరిచినట్లు కాదా? ఇలాంటివాటి కోసం అవార్డులు ప్రకటిస్తే నేర ప్రవృత్తిని ప్రోత్సహించినటే అవుతుంది. ఇది అవార్డుల నిబంధనలకు కూడా విరుద్ధం! అసలు ఈ సినిమాలో సామాజిక కోణంలో ప్రజలకు ఉపయోగపడే సందేశం ఒక్కటైనా ఉందా? ఈ చిత్రంలో వచ్చిన సన్నివేశాల మాదిరి కొంతమంది యువత స్మగ్లర్ల అవతారమెత్తి అరెస్టు కూడా అయ్యారు. పోలీసుల ప్రెస్మీట్లో పుష్ప సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. యువతను పక్కదారి పట్టించే ఇలాంటి సినిమాలకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం బాధాకరమైన విషయం. ఇకపోతే ‘రజాకార్ సినిమా’ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించిందని, మత ఘర్షణలను ఉసిగొలిపేలా ఉందని, ప్రముఖ రచయితలు, చరిత్రకారులు తమ వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో విశ్లేషించారు. అలాంటి సినిమాకు ఈరోజు ప్రభుత్వం, చారిత్రక సినిమా విభాగంలో అవార్డును ప్రకటించించింది. అంటే ఆ వక్రీకరించిన చరిత్ర వాస్తవ మేనని, ప్రభుత్వమే నిర్ధారించినటే కదా! ఉర్దూ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటిస్తామన్న సర్కార్, ఉర్దూ భాష తెలిసిన వారితో జ్యూరీ ఒకటి పెట్టాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. పదేండ్ల అవార్డుల్లో ఉర్దూ సినిమాలకు అవార్డులు ఎందుకు ప్రకటించలేదు? 2024 సంవత్సరంలో తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఎంట్రీస్ కోసం అప్లికేషన్స్ స్వీకరించి, వారికి ఈ వేదికపై అవార్డులు ఎందుకివ్వలేదు. ఇదంతా చూస్తే కొంతమంది కోసం మాత్రమే ఈ అవార్డుల ఫంక్షన్ జరిగినట్టు అనిపిస్తున్నది.
2024లో తీసిన సినిమాలకు దరఖాస్తులను ఆహ్వానించి, 2014 నుండి 2023 వరకు ఎంపికచేసే సినిమాలకు దరఖాస్తులు ఎందుకు సేకరించలేదు? ఒకవేళ సెన్సార్ అయిన దాదాపు రెండు వేల సినిమాలను ఒక్క నెలలోనే ఎలా చూస్తారు?ఇది సాధ్యమయ్యే పనేనా? సినిమాలను చూడకుండా ఎంపికచేయడం, చట్ట విరుద్ధమే కదా! ఇది ఇష్టం వచ్చినోళ్లకు, ఇష్టమొచ్చినట్లు ఇచ్చుకున్నట్టే కానీ ఇందులో చెప్పుకోదగ్గ స్ఫూర్తివంతమైన అంశం ఒక్కటి కూడా లేదు. ఇది నిజంగా అన్యాయయే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేండ్లు సినిమాల్లో పనిచేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులివ్వకుండా నిర్మాతలకే ఎందుకిచ్చినట్టు? అవార్డుల లక్ష్యం కళాకారులను ప్రోత్సహించడానికే కదా?వారిని విస్మరించి, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రజాసొమ్మును ఎందుకు ధారపోసినట్లు? టీఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత కాబట్టేనా? ఆయనకు సంబంధించిన నాలుగు సినిమాలు ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ రకమైన విధానమో, దేని ప్రకారం అవార్డులు కేటాయించిందో దశాబ్దకాలంగా పనిచేసిన, నేటికీ చేస్తున్న సినీ కళాకారులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సినిమాల్లో పనిచేసిన వాళ్లే జ్యూరీలో ఉండడం, వారి సినిమాలకు వారే అవార్డులు ఇచ్చుకోవడం నిజంగా అన్యాయం. అవార్డులకు అర్హత కలిలిగిన ఎన్నో సినిమాలున్నా వాటిని పట్టించుకోలేదు. పైగా వాటిని జ్యూరీ కమిటీలు చూడనూ లేదు. అంటే అవకతవకలు జరిగినట్టే కదా? ప్రభుత్వం ఎంపిక చేసిన విధానం, ఎంపికైన సినిమాలే ఈ వ్యవహారానికి సాక్ష్యాలు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలవల్ల, ప్రభుత్వ ఖజానాతో ఒక కార్యక్రమాన్ని జిగేల్ మనిపించవచ్చు. కానీ, పజలు, సినీ కళాకారుల్లో వ్యతిరేకత వస్తుందన్న విషయం పాలకులు గమనించకపోవడం శోచనీయం. తెలంగాణ తెచ్చుకున్నందుకు ముందు రాష్ట్రంలో సినిమా పాలసీ తయారు చేసుకుని, మంచి కళాత్మక సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. కానీ ఇవేమీ చేయకుండానే బహుమానాలు ఇచ్చుకోవడం అర్థం లేనిదని సినీరంగంలోనే ఒక చర్చ నడుస్తున్నది.ఆ ఆవకాశం నేటి ప్రభుత్వం ఈ అవార్డు ఫంక్షన్తో మరింత పెంచింది. తెలంగాణా కళాకారుల పారలల్ సినిమాలే లేవు, గద్దర్ స్పూర్తికి నిదర్శనమయ్యే సినిమాలు అంతకన్నా లేవు. వేదికమీదికెళ్లి, ఎవరి పేరు మీదనైదే అవార్డులున్నాయో, ఆయనకు, తీసుకునే వాళ్లకు, ఏమైనా సంబంధం ఉన్నదా?ఇక ప్రజలే ఆలోచించాలి.
సయ్యద్ రఫీ
ఈ అవార్డులు ఎవరికోసం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES