Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎవరి పేర్లు బయటపెడతారో?

ఎవరి పేర్లు బయటపెడతారో?

- Advertisement -

– ఐపీఎస్‌ ప్రభాకర్‌రావు రాకపై అందరి చూపు
– ‘ఫోన్‌ ట్యాపింగ్‌’పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కేసు దర్యాప్తు జరుపుతున్న జూబ్లీహిల్స్‌ స్పెషల్‌ టీం అధికారుల ఎదుట సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా హాజరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది కాలంగా ప్రభాకర్‌రావు చికిత్స నిమిత్తం వెళ్లి అమెరికాలోనే ఉన్న విషయం తెలిసిందే. ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నమోదు కాకముందు వెళ్లిన ఆయన.. ఈ కేసులో తనను కూడా నిందితుడిగా పేర్కొంటూ స్పెషల్‌ టీం అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటంతో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. మరోవైపు, ప్రభాకర్‌రావును అమెరికా నుంచి తీసుకురావటానికి దర్యాప్తు అధికారులు ఇంటర్‌పోల్‌ సహాయాన్ని కూడా కోరారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, బుజంగరావు, రాధాకిషన్‌రావులు తాము ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు దర్యాప్తు అధికారుల ఎదుట అంగీకరించారు. దీంతో ప్రభాకర్‌రావును విచారించటం ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారాల వెనుక ఉన్న అప్పటి ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్‌ బాస్‌లు ఎవరన్నది బయట పడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌లు జరపాలంటూ కిందిస్థాయి అధికారులను పురమాయించారన్నది కూడా తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు స్పందిస్తూ.. మూడ్రోజుల్లోగా భారత్‌కు వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరై, విచారణకు సహకరించాలని చెప్తూ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును కూడా పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఫలితంగా తప్పనిసరిగా విచారణాధికారుల ఎదుట హాజరవ్వాల్సిన పరిస్థితులు ప్రభాకర్‌రావుకు ఏర్పడ్డాయి. దీంతో ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారుల ఎదుట ఎలాంటి సమాచారాన్ని ప్రభాకర్‌రావు బయట పెడతారోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ముఖ్యంగా, ఎవరి ఆదేశాల మేరకు ఆయన ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నడిపించా రోనన్నది తేలుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అందరి చూపులు ప్రభాకర్‌రావు రాక, దర్యాప్తు అధికారుల విచారణపై నిలిచాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -