అలుగు వర్షిణి పిల్లలు స్కూళ్లో టాయిలెట్లు కడుగుతున్నారా? : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళిత విద్యార్థులను అవమానిస్తూ, అన్యాయం చేస్తున్నా.. మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎస్సీ సంక్షేమ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవీణ్ కుమార్ను కలిసి సమస్యలపై చర్చించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా ఎందుకు బతుకున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు వారి టాయిలెట్లు వారే కడుక్కుంటే తప్పేంటని ఐఏఎస్ అధికారి అంటున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వారి వారి ఇండ్లల్లో టాయిలెట్లు వారే కడుక్కుంటున్నారా? ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి పిల్లలు స్కూళ్లో టాయిలెట్లు కడుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గాల పట్ల వివక్ష చూపించిన వర్షిణిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల్లో పరిస్థితి దిగజారిందనీ, అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికంటే పెద్ద మాదిగ, పెద్ద మాల నేనే అనే రేవంత్ రెడ్డి, పేద పిల్లలు వారి టాయిలెట్స్ వారే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎలా చెప్పించారని ప్రశ్నించారు. ఎస్సీలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని కేసీఆర్ గురుకులాలు పెడితే, వాటి పట్ల కాంగ్రెస్ సర్కారు వివక్షతో వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేని వారిని సాంఘీక సంక్షేమ శాఖలో కూర్చొబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థిని ఆగసార నందినికి గోల్డ్ మెడల్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు నగదు ప్రోత్సాహం ఇవ్వలేదని ప్రశ్నించారు.
గౌలిదొడ్డిలో ఉన్న గురుకుల పాఠశాల సిబ్బందిని తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌలిదొడ్డిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని చెప్తున్న రాజ్యాంగం? సంపన్న వర్గాల పిల్లలకు ఒక రూల్… పేద పిల్లలకు మరొక రూల్? మా రొట్టెలు మేమే చేసుకుని తినాలా…? అని ప్రశ్నించారు. ఎస్సీలకు బార్సు, గర్ల్స్కు ఒకే చోట తరగతులు ఉండకూడదని ప్రభుత్వం చెబుతున్నదనీ, అమ్మాయిలకు భువనగిరిలో సైనిక స్కూల్ పెడితే దాన్ని మూసివేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు నెలకొల్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని చెప్పారు. గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా రేవంత్ రెడ్డి, అలుగు వర్షిని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
”గురుకుల ఇంటర్ కాలేజీల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం సప్లమెంటరీ ఫీజు కట్టలేదు. గురుకులాల విద్యార్థులు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గరకు వెళ్తే ఆయన ఏం చేయలేకపోయారు. గురుకులాల అసిస్టెంట్ కేర్ టేకర్స్ను అలుగు వర్షిణి తొలగించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో పెట్టిన సమ్మర్ క్యాంపులను రేవంత్ రెడ్డి పాలనలో రద్దు చేశారు. మూడు స్కూళ్లకు కలిపి ఒక ఎలక్ట్రిషియన్ను పెట్టారు. గురుకులాల్లో ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరముంది. అందుకోసం తల్లిదండ్రులు నోరు విప్పాలని…. ” ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
దళిత మంత్రులు, ఎమ్మెల్యేలుబానిసలుగా ఎందుకు బతుకుతున్నారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES