రైతు భరోసాపై ఎమ్మెల్యే మౌనం ఎందుకు
సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామేల్
ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవే కావాలా.? భరోసా రాని రైతుల గోడు పట్టదా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి సామేల్ ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పంటలు సాగు చేస్తున్న వారు రైతులు కారా అని నిలదీశారు. ఇంత జరుగుతున్న రైతు భరోసాపై ఎమ్మెల్యే ఎందుకు మౌనం వహిస్తున్నారని మండి పడ్డారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ సునీత రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పిందన్నారు. కానీ ప్రస్తుతం ఎకరాకు రూ.6 వేల మాత్రమే ఇస్తుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న జిల్లాలోని తొమ్మిది మండలాలకు భరోసా ఎందుకు నిలిపివేసిందన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా భరోసా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇబ్రహీంపట్నం మండలంలోని ఏ ఒక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించటం లేదన్నారు. మండలంలో పెద్ద ఎత్తున వరి, కూరగాయలు, ఆకుకూరలు పండ్లు పండిస్తున్నారన్నారు. ప్రభుత్వం రైతులు వ్యవసాయం చేయటం లేదన్న కారణంతో రైతుభరోసా నిలిపివేయటం సమంజసం కాదని, రైతు భరోసా నిలిపివేయటం వల్ల వేలమంది రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పెట్టుబడి సాయం కోసం రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నారు.
ప్రభుత్వం ఎలాంటి వ్యత్యాసాలు చూడకుండా తక్షణమే అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదని విమర్శించారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని లేని పక్షంలో రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్.జంగయ్య, పి.జగన్, మండల కార్యదర్శి సీహెచ్.బుగ్గరాములు, మున్సిపల్ కార్యదర్శి సీహెచ్.ఎల్లేష్, సీపీఐ(ఎం) నాయకులు డి.గణేష్, ఎం.వెంకటేష్, సీహెచ్.ముసిలయ్య, నర్సింహ, నీరుడు బిక్షపతి, జంగయ్య, మల్లేష్,పురుషోత్తం, ఆనంద్, విఘ్నేష్ దాసు, గణేష్,అశోక్, స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.