ఈ నెల 24 నుంచి రోహిణి కార్తి ప్రవేశిస్తున్నది. ఈ సారి ముందస్తు వర్షాలు పడటంతో వానకాలం పంటలు వేస్తారు. రోహిణిలో వేసిన పంటలకు క్రిమీ,కీటకాల దాడులకు తక్కువ నష్టం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే మృగశీర (జూన్ 10) కార్తెలో పంటలు వేయడం వల్ల క్రిమీ, కీటకాల దాడులు పెరుగుతాయి. ఈసారి రాష్ట్రంలో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ చెబుతున్నది. అందువల్ల రాష్ట్రంలో వ్యవసాయశాఖ సమాయత్తమై విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఆదేశించారు. వ్యవసాయ శాఖలో రైతులకు అనుకూలంగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. కానీ, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనితీరు ప్రణాళిక బద్ధంగా లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021- 22 నుండి వ్యవసాయ ప్రణాళికను ముద్రించడం రద్దు చేసింది. నాటి ముఖ్యమంత్రి మాటే వేదంగా వ్యవసాయ శాఖ పంటల విధానాన్ని రూపొందించింది. ముఖ్యంగా వరి, పత్తి ప్రధాన పంటలుగా ముందుకు వచ్చాయి. వీటికి కనీస మద్ధతు ధరలుండడం వల్ల రైతులు ఈ రెండు పంటలపై కేంద్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో వానాకాలం 125 లక్షల ఎకరాలల్లో పంటలు వేయగా అందులో 65 లక్షల ఎకరాలు వరి, మరో 50 లక్షల ఎకరాలు పత్తి పంట వేస్తున్నారు. మిగిలిన సాగులో ముతక ధాన్యాలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొక్కజొన్న, పప్పులు, నూనె గింజల పంటలు వేస్తున్నారు. ఏ స్థాయి కలిగిన భూమిలో ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన లేదు. ఒక విధంగా ప్రణాళికలేని అరాచక ఉత్పత్తి కొనసాగుతున్నది. గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్రంలో 165 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా నలభై లక్షల ఎకరాలు వివిధ కారణాల వల్ల బీళ్లుగా మారాయి. పన్నెండు లక్షల ఎకరాలల్లో హార్టికల్చర్ పంటలు వేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ విస్తీర్ణం పెరగడంలేదు. హార్టీకల్చర్ శాఖ ఉన్నట్టు రైతులకు అంతగా తెలియదు. రాష్ట్రంలో వాతావరణం ”సమ శీతోష్ణ”గా ఉండటం వల్ల అన్ని రకాల పంటలకు అవకాశాలున్నాయి. అయినప్పటికీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర అవసరాలను గుర్తించక పోవడంతో కూరగాయలు, ఆకుకూరలు (కొత్తిమీర), పండ్లు, ఉల్లి, పప్పులు, నూనెలు, సుగంధ ద్రవ్యాల ఉప ఉత్పత్తులు, ముతక ధాన్యాల ఉపఉత్పత్తులు పెద్దఎత్తున విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం.
రాష్ట్రం నుండి విత్తనాలు, పత్తి, బియ్యం, మాత్రమే ఎగుమతులు చేస్తున్నాం. దిగుమతుల వల్ల రైతులే కాక వినియోగదారులు విపరీతమైన ఆర్థిక భారం భరిస్తున్నారు. దిగుమతులు చేసుకునే పంటలను రాష్ట్రంలో పండించడానికి వీలున్నప్పటికీ ప్రణాళిక లేకపోవడం వల్ల దిగుమతులు జరుగుతున్నాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖాధికారులకు రైతులతో ఎలాంటి సంబంధాలు లేవు. వీరి నుండి రైతులకు పంటల సలహాలు లభ్యం కావడం లేదు. రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాల వ్యాపారులే శాస్త్రవేత్తలుగా సలహాలిస్తున్నారు. తమ దగ్గర ఉన్న సరుకు అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులు ఏనాడు రైతులతో సమావేశాలు జరపలేదు.
వ్యవసాయానికి తగ్గిన బడ్జెట్
గతేడాది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉండటం వల్ల రూ.33,493 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను కేటాయించారు. 2025-26 సంవత్సరానికి రూ.18,101 కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రకటించారు. పశుసంవర్థశాఖకు గతేడాది రూ.1,970 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1,657 కోట్లకు తగ్గించారు. వ్యవసాయ పరిశోధనలకు పూర్తిగా తగ్గింపు చేయడంతో కార్పోరేట్ సంస్థల నుండి, విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన విత్తనాలు రాష్ట్ర వాతావరణానికి సరిపోనందున దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా నాణ్యత లేని విత్తనాలను కొన్ని సంస్థలు అమ్మడం ద్వారా యేటా 5-6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు విత్తన చట్టం లేకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అన్ని పంటల విత్తనాలు కలిసి రాష్ట్రానికి 20 లక్షల క్వింటాళ్లు కావాలి. కానీ, రాష్ట్రంలో 1.9 లక్షల క్వింటాళ్లు అదనంగా ఉత్పత్తి చేసి అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. ఉత్తర భారతదేశానికి జొన్న, కూరగాయల విత్తనాలను రాష్ట్రం నుండే ఎగుమతి చేసినప్పటికీ రైతులకు నాణ్య మైన విత్తనాలు లభ్యం కావడంలేదు.
రుణ ప్రణాళిక, రైతుబీమా
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఆర్థిక మంత్రి నియంతృత్వంలో వార్షిక రుణ ప్రణాళికను రూపొందిస్తారు. గత ఐదేండ్లుగా రుణ ప్రణాళికను ప్రకటించడం గానీ, అమలు జరపడం గానీ, వ్యవసాయ శాఖ నిర్వహించడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారం 2024-25లో 35.25 లక్షల మంది రైతులకు 90,792 కోట్లు పంట రుణాలు లక్ష్యంగా నిర్ణయించి రూ.60,713 కోట్లు (66.87శాతం) మాత్రమే పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇందులో కూడా బుక్ అడ్జెస్ట్మెంట్ ద్వారా రుణాలు తిరగరాసేవే ఎక్కువ. 2014 నుండి రుణ మాఫీ పథకాలు రావడంతో బ్యాంకులు వ్యవసాయ రుణాలను తగ్గించి వేశాయి. ప్రయివేటురుణాలపై ఆధారపడి వ్యవసాయాలు సాగిస్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో నేటికీ ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. మొత్తం 72 లక్షల మంది రైతు కమతాలు ఉండగా బ్యాంకులు 45 లక్షల మందికి మాత్రమే రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ విధానం సరిచేసి అందరికీ పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వారికున్న భూమి మేరకు ఇవ్వాలి. రుణ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళికలో పొందుపరిచి జిల్లాల వారిగా కేటాయింపుల్ని అమలు చేయాలి.
పంటల బీమా, రైతు భరోసా
2020-21 నుండి రాష్ట్రంలో ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రధాని ఫసల్ బీమాలో చేరుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ 2024-25లో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతు బీమా పరిహారం తెలంగాణకు రాలేదు. కనీసం 2025-26లో నైనా మొత్తం రైతుల పంటల ఆధారంగా 2025 జూన్ 15 నాటికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి. అలా ప్రీమియం చెల్లిస్తేనే పంటల బీమా పథకం అమలవుతున్నది. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా రైతులందరికీ పంటల బీమా సౌకర్యం కల్పించాలి.
పంటలకు కనీస మద్దతు ధరలు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పది పంటలకు కేంద్ర ప్రభుత్వం కన్నా అదనపు కనీస మద్దతు ధరలు ప్రకటించారు. సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ.500ల బోనస్ మినహా మిగిలిన పంటలకు నిర్ణయించిన ప్రకారం ఇవ్వడం లేదు. మొక్క జొన్న, కందులు, సోయ, పత్తి, జొన్నలు, మిరప, పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు నిర్ణయించిన ధరలు నాఫెడ్ ద్వారా లేదా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు అమలు చేయాలి. కానీ, ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, మధ్య దళారీలకు లొంగి మార్కెట్లలో రైతులు అతితక్కువ ధరలకు అమ్ముకునే విధంగా విధానం రూపొందించారు. కానీ, మంత్రులు మాత్రం కనీసం మద్ధతు ధరలు లభ్యమౌతున్నట్లు ప్రకటిస్తున్నారు. మార్కెటింగ్ శాఖపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. మార్కెట్లకు వచ్చిన దాన్యం 15-20 రోజుల వరకు కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు యేటా కనీసం మద్ధతు ధరలు రాక రూ.4,500 కోట్లు నష్టపోతున్నారు.
అందువల్ల రైతులకు జరుగుతున్న నష్టాలే కాక వినియోగదారులకు కావాల్సిన ఉత్పత్తులను ఉత్పత్తి చేసి అందించటానికి వ్యవసాయ ప్రణాళికలు రూపొం దించాలి. దిగుమతుల అవసరం లేకుండా ఉత్పత్తులు పెంచాలి. నాణ్యమైన విత్తనాలతో పాటు మౌలిక వసతు లను కల్పించాలి. మండల స్థాయిలో వ్యవసాయ శాఖాధికారులు రైతుల సమావేశాలు ఏర్పాటు చేసి భూముల పరిస్థితులను బట్టి పంటలను రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని అమోదించాలి. అలాగే, వ్యవసాయోత్పత్తుల నిలవకు తగిన గోదాములను నిర్మించాలి. మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవసాయ రంగంతోపాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకానీ ప్రకటనలద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి కాదు.
సారంపల్లి మల్లారెడ్డి 9490098666
ప్రణాళిక లేని రాష్ట్ర వ్యవసాయ రంగంసమస్యల్ని పరిష్కరిస్తుందా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES