– చుట్టూ వెలసిన భవన యజమానులు 36 మందికి నోటీసులు జారీ
– భూసరిహద్దులపై రెవిన్యూ – ఐబీ సంయుక్త సర్వే
నవతెలంగాణ – అశ్వారావుపేట
1500 ఎకరాలకు సాగునీరు అందించిన దొంతికుంట చెరువు ప్రస్తుతం ఆక్రమణల మధ్య తన అసలు వైశాల్యాన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. రెవిన్యూ శాఖ రికార్డుల ప్రకారం 23 ఎకరాలు 38 కుంటల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు చుట్టూ ప్రస్తుతం బహుళ అంతస్థుల భవనాలు వెలిసిన విషయం తెలిసిందే.
మున్సిపాలిటీగా మారిన తరువాత చెరువు పునరుద్ధరణ, ఆధునీకరణ, సుందరీకరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం నీటిపారుదల శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.
ఐబీ ఈఈ బి.క్రిష్ణ మాట్లాడుతూ చెరువు పరిధిలో నిర్మాణాలు చేసిన 36 మంది యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. చెరువు పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిమితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
రెవిన్యూ సర్వేయర్ నాగరాజు మాట్లాడుతూ అధికారిక రికార్డుల ఆధారంగా చెరువు భూమి సరిహద్దులను ఖరారు చేస్తామని చెప్పారు. స్థానికంగా చెరువు పునరుద్ధరణ చర్యలపై ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. చెరువు ఆక్రమణల తొలగింపు జరిగితే పట్టణానికి పర్యావరణ పరంగా కూడా మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ డీఈఈ ఎల్.క్రిష్ణ,ఏఈఈ శ్రీనివాస్,జీపీఓ లు పాల్గొన్నారు.



