యూఎస్ కోర్టు తీర్పుతో భారత్కు లైన్ క్లియర్
ట్రంప్ ఆంక్షలను మోడీ అధిగమించేనా..?
న్యూఢిల్లీ : అంతర్జాతీయ చమురు మార్కెట్లో మళ్ళీ పాత సమీకరణాలు తెరపైకి వచ్చే సంకేతాలు కనబడుతున్నాయి. ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పుతో రష్యా చమురు దిగుమతులపై భారత్కు ఉన్న ఆంక్షల భయం దాదాపు తొలగిపోయింది. చట్టసభ ఆమోదం లేకుండా ఏకపక్షంగా సుంకాలు విధించడం సాధ్యం కాదని అక్కడి కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ బెదిరింపు లు, ఆంక్షలను ఎదురించి.. మోడి సర్కార్ రష్యా నుంచి చౌక చమురు కొనుగోళ్లను పెంచడంపై సందిగ్దత నెలకొంది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పరోక్షంగా ట్రంప్ షరతులను మోడీ సర్కార్ అంగీకరిస్తే.. దీర్ఘకాలంలో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారం కానున్నాయి. 2025 డిసెంబర్లో భారత దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతం నుండి 25 శాతం లోపునకు పడిపోయినప్పటికీ.. తాజా పరిణామాల తో భారత్ మళ్లీ చౌకగా లభించే రష్యా చమురు వైపు మొగ్గు చూపుతోందో లేదో వేచి చూడాలి.
రష్యా చమురు 8 శాతం చౌక..
ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా చమురు కంటే రష్యా చమురు టన్నుకు సుమారు 38 డాలర్లు లేదా 8 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. ట్రంప్ ఆంక్షలతో 2025 చివరలో రష్యా వాటా కొంత తగ్గినప్పటికీ.. తాజాగా లభించిన చట్టపరమైన వెసులుబాటుతో భారత్ మళ్ళీ చౌకగా లభించే రష్యా చమురు దిగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ట్రంప్ విధించాలనుకున్న 18 శాతం సుంకాలపై ఇప్పుడు అనిశ్చితి నెలకొనడంతో.. భారత్ తన ఇంధన భద్రత విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ట్రంప్ సర్కార్ను సంతృప్తి పర్చడానికి అమెరికా నుండి విమాన విడిభాగాలు, టెక్నాలజీ, టెలికం తదితర 500 బిలియన్ డాలర్లు (రూ.45 లక్షల కోట్లు) విలువ చేసే దిగుమతులకు మోడీ సర్కార్ అనుమతించిన విషయం తెలిసిందే. కాగా.. సామాన్య ప్రజలపై భారం పడకుండా ఉండాలంటే రష్యా నుంచి చౌక చమురు దిగుమతులే ఏకైక మార్గం కావడంతో తదుపరి భారత్ విదేశీ విధానం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.



