Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్యూచర్‌ సిటీతో బీసీల ఫ్యూచర్‌ మారుతుందా?

ఫ్యూచర్‌ సిటీతో బీసీల ఫ్యూచర్‌ మారుతుందా?

- Advertisement -

మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేసిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటేనే మోసమని విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప వారి అభివృద్ధి కోసం చేసింది ఏం లేదని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ లో చేరుస్తామన్నారనీ, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నిధులు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ చెప్పిందనీ, దాని ఊసే లేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.12 వేల కోట్లు ఉన్నాయనీ, కేటాయింపులు మాత్రం సరిపోను లేవని చెప్పారు. నామినేటెడ్‌ పదవులు బీసీలకు ఇవ్వడం లేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఫ్యూచర్‌ సిటీతో బీసీల ఫ్యూచర్‌ మారుతుందా?అని అడిగారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ మూడేండ్లలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. బీసీల్లో అన్ని వర్గాలకూ అన్యాయం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, రాకేశ్‌, నాగేందర్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు కె కిశోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -