భారత్, ఆసీస్ రెండో వన్డే నేడు
ఉ|| 9 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
నవతెలంగాణ-ఆడిలైడ్
భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. పెర్త్ వన్డేలో దారుణ ఓటమి చవిచూసింది. నిలకడగా కురిసిన వర్షం, డ్రాప్ ఇన్ పిచ్ ప్రభావం భారత బ్యాటర్ల వైఫల్యానికి దారితీసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్లో 1-0 ముందంజలో నిలిచిన ఆస్ట్రేలియా నేడు ఆడిలైడ్లో సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పిచ్, చిన్న బౌండరీల ఆడిలైడ్లో పరుగుల వేట సాగించాలనే సంకల్పంతో ఉన్న శుభ్మన్ గిల్ సేన… నేడు ఆడిలైడ్ విజయంతో లెక్క సరి చేసేందుకు ఎదురుచూస్తోంది. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే నేడు ఉదయం 9 గంటలకు ఆరంభం కానుంది.
ఆ ఇద్దరు మెరిసేనా? :
ఈ ఏడాది మార్చి తర్వాత తొలిసారి పెర్త్ వన్డేలో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ సీజన్లో మరో రెండు మ్యాచులు ఆడనున్నారు. దీంతో జట్టు మేనేజ్మెంట్తో పాటు అభిమానులు స్టార్ క్రికెటర్ల పరుగుల వేటపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆడిలైడ్లో రోహిత్, విరాట్ భారీ ఇన్నింగ్స్లు ఆడితే భారత్కు ఇక తిరుగుండదు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నారు. బంతితో అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు స్వల్ప బౌండరీల స్టేడియంలో క్రమశిక్షణతో బౌలింగ్ చేయాల్సి ఉంది.
జోరుమీదున్న ఆసీస్ :
అలెక్స్ కేరీ, ఆడం జంపా రాకతో ఆసీస్ శిబిరం రెట్టించిన ఉత్సాహంలో ఉంది. మిచెల్ మార్ష్, ట్రావిశ్ ఎడ్లు మంచి ఫామ్లో ఉన్నారు. అలెక్స్ కేరీ, మాట్ రెన్షా సమా కూపర్, మాథ్యూ షార్ట్లు సత్తా చాటాలని ఎదురూచూస్తున్నారు. మిచెల్ స్టార్క్ మరోసారి బంతితో భారత్కు సవాల్ విసిరేందుకు చూస్తుండగా.. నాథన్ ఎలిస్, జోశ్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్లు జోరుమీదున్నారు.