Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమావోయిస్టుల బంద్‌తోఉత్తర తెలంగాణలో హైఅలర్ట్‌

మావోయిస్టుల బంద్‌తోఉత్తర తెలంగాణలో హైఅలర్ట్‌

- Advertisement -

– రాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌
– అధికారులతో పరిస్థితిని సమీక్షించిన డీజీపీ జితేందర్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఈనెల 10న మావోయిస్టులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసులు అంతర్గత హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇటీవలన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది వరకు కీలకమైన నాయకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించినందుకు సాయుధ బలగాలను ప్రధానమంత్రితో పాటు దేశ హౌం మంత్రి అభినందించారు. మావోయిస్టు చరిత్రలోనే ఇంత భారీ ఎన్‌కౌంటర్‌ జరగటం, ఏకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శే మరణించటాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. ఈ ఘటనతో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడుచుపెట్టుకుపోయినట్టేనని కేంద్ర హౌం శాఖ కూడా ప్రకటించింది. అయితే, తమ పార్టీ అగ్రనాయకత్వాన్ని సాయుధ బలగాలు చుట్టుముట్టి, హింసించి చంపాయని ప్రకటించిన మావోయిస్టు జాతీయ ప్రతినిధి అభరు.. ఇందుకు నిరసనగా పదో తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు పార్టీ బలం తగ్గిపోయిందనీ, ప్రభుత్వాలు భావిస్తూనే.. మరోపక్క, ముందు జాగ్రత్త చర్యలను చేపడుతున్నాయి. తాము పూర్తిగా దెబ్బ తినలేదని నిరూపించుకోవటానికి మావోయిస్టులు తెగించి ఏదేనీ భారీ హింసకు పాల్పడే ప్రమాదమున్నదని కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో పాటు రాష్ట్ర యాంటీ నక్సలైట్‌ విభాగం నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర పోలీసు శాఖను కూడా అధికారులు హెచ్చరించారు.
పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ జితేందర్‌
ప్రస్తుత పరిస్థితుల నడుమ ఉత్తర తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్‌ అధికారులతో డీజీపీ జితేందర్‌ పరిస్థితిని సమీక్షించారు. వారికి పలు ముందుజాగ్రత్త చర్యలను సూచించారు. ముఖ్యంగా, శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా భావిస్తున్న ఓదేలు అలియాస్‌ భాస్కర్‌ ఎన్‌కౌంటర్‌ కావటంతో ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదే సమయంలో, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచటమేగాక గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సాయుధ బలగాలతో కూంబింగ్‌ ఆపరేషన్‌ను ఉధృతం చేశారు. ఇందుకు అవసరమైన అదనపు బలగాలనూ అక్కడ మోహరించారు. మరోవైపు, బంద్‌ సందర్భంగా మావోయిస్టుల నుంచి ఎలాంటి చిన్న హింసాత్మక సంఘటన కూడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణతో పాటు మావోయిస్టు ప్రభావితం రాష్ట్రాలను కేంద్ర హౌం శాఖ హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -