– తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్
– సారథి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-మియాపూర్
మహిళలు అంటే అంగడిలో సరుకు కాదని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాదాపూర్లోని సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుంచి వచ్చిన సారథి మహిళా కళాకారులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల.. రాసి, పాడిన మహిళా దినోత్సవ పాట సీడీతో పాటు వివిధ జిల్లాల సారథి కళాకారులు రూపొందించిన మహిళా చైతన్య గీతాల సీడీలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో డాక్టర్ మాట్లాడుతూ.. మహిళలు ఉద్యోగం చేసే రోజులు పోయి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల నైపుణ్యాలను చూస్తుంటే వివక్షకు గురి కాకుండా ఉండే రోజులు వస్తున్నాయని, స్త్రీలే సమాజ నిర్మాతలుగా నిలుస్తున్నారని అన్నారు. సావిత్రి బాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి మాట్లాడుతూ.. మహిళలు కుటీర పరిశ్రమలు నెలకొల్పి, వ్యాపార వేత్తలుగా ఎదగాలన్నారు. తమలో ఉన్న ప్రతిభను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను కూడా వ్యాపారంగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, రచయిత దినకర్, సారథి కార్యనిర్వాహక అధికారి విజరుకుమార్, సారథి మహిళా కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అంగడిలో సరుకు కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



