పురుషులదే ఆధిపత్యం
నిరుద్యోగ తగ్గుదల స్వల్పమే: పీఎల్ఎఫ్ఎస్ సమాచారం
న్యూఢిల్లీ : భారత్లోని మోడీ పాలనలో నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా ఉన్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోడీ.. ప్రధాని అయ్యాక ఆ హామీని గాలికొదిలేశారు. దీంతో దేశంలోని యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నది. ఇక మహిళలకు ఉపాధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉపాధిలో పురుషుల ఆధిపత్యమే కనిపిస్తున్నది. దేశంలో నిరుద్యోగ రేటుపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వెల్లడించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. పీఎఫ్ఎల్ఎస్ సమాచారం ప్రకారం.. గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో 56.2 కోట్ల మంది ఉపాధిలో ఉన్నారు. ఇందులో 39.6 కోట్ల మంది పురుషులు కాగా, 16.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
ఈ సంఖ్య అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 57.4 కోట్లుగా నమోదైంది. ఇందులోనూ పురుషుల ఆధిపత్యమే ఉన్నది. వీరిలో పురుషుల సంఖ్య 40.2 కోట్లు కాగా… మహిళలు 17.2 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళలకు ఆశించిన స్థాయిలో ఉపాధి కల్పించలేకపోతున్నదని పలువురు పీఎఫ్ఎల్ఎస్ సమాచారాన్ని ఉదహరిస్తున్నారు. దేశంలో నిరుద్యోగ తగ్గుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పే మోడీ సర్కారు… ఆ సమస్యను ఎదుర్కోవడంలో ప్రతీసారీ విఫలమవుతున్నది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం స్వల్పంగానే తగ్గుదలను నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏండ్లు, అంతకంటే పైవయసుగలవారిలో నిరుద్యోగ రేటు 4.4 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గింది.
ఇక పట్టణ ప్రాంతాల్లో ఇది 6.7 శాతానికి పడిపోయింది. గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పురుషుల నిరుద్యోగ రేటు 6.2 శాతం ఉండగా… అది 5.9 శాతానికి పడిపోయింది. 15 ఏండ్లు, అంత కంటే ఎక్కువ వయసున్న వారిలో మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్)55.8 శాతానికి పెరిగింది. అంతకముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక మహిళల్లో ఎల్ఎఫ్పీఆర్ 33.7 శాతం నుంచి 34.9 శాతానికి పెరిగింది. గ్రామీణ, పట్ణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్మికుల వాటా 0.4 శాతమే పెరిగింది. ఉపాధిలో వ్యవసాయ రంగం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ ఉపాధి పెరుగుదల 0.8 శాతమే కావడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో తృతీయ రంగం స్థిరంగానే కొనసాగింది. ఇందులో 61.9 శాతం మంది కార్మికులు పని చేస్తున్నారు.



