Sunday, June 29, 2025
E-PAPER
Homeఆటలుఐదు వేదికల్లో మహిళల ప్రపంచకప్‌

ఐదు వేదికల్లో మహిళల ప్రపంచకప్‌

- Advertisement -

కొలంబోలో పాకిస్థాన్‌ మ్యాచుల షెడ్యూల్‌
న్యూఢిల్లీ : ఐసీసీ 2025 మహిలల వన్డే వరల్డ్‌కప్‌ వేదికలు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 2 వరకు జరుగనున్న ప్రపంచకప్‌కు బెంగళూర్‌, గువహటి, విశాఖపట్నం, ఇండోర్‌ సహా శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐసీసీ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. బీసీసీఐ, పీసీబీ ఒప్పందం ప్రకారం హైబ్రిడ్‌ మోడల్‌లో పాకిస్థాన్‌ జట్టు మ్యాచులను పూర్తిగా కొలంబోలో షెడ్యూల్‌ చేశారు. నవంబర్‌ 2న ఫైనల్‌ మ్యాచ్‌ను బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో షెడ్యూల్‌ చేయగా.. ఒకవేళ పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంటే టైటిల్‌ పోరు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. పూర్తి షెడ్యూల్‌ విడుదల చేయకపోయినా.. ఆరంభ, ముగింపు తేదిలు సహా వేదికలను ఖరారు చేశారు.
2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లు టైటిల్‌ వేటలో నిలువనున్నాయి. సెప్టెంబర్‌ 30న బెంగళూర్‌లో ఆరంభ మ్యాచ్‌ జరుగనుండగా.. ఆతిథ్య భారత్‌ తొలి మ్యాచ్‌లో ఆడనుంది. అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌కు గువహటి లేదా కొలంబో.. అక్టోబర్‌ 30న రెండో సెమీఫైనల్‌కు బెంగళూర్‌ వేదికగా నిలువనున్నాయి. విశాఖపట్నం టోర్నమెంట్‌ తొలి మ్యాచ్‌కు వేదికగా నిలుస్తుందని భావించినా.. గ్రూప్‌ దశ మ్యాచులకు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా, 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లో జరుగనుండగా.. జూన్‌ 12-జులై 5 వరకు టోర్నమెంట్‌ షెడ్యూల్‌ చేశారు. జులై 5న ఫైనల్‌కు లార్డ్స్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 ప్రపంచకప్‌లో 12 జట్లు పోటీపడనుండగా..24 రోజుల్లో 33 మ్యాచులు ఏడు వేదికల్లో జరుగుతాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ సహా డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ 2026 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఇతర నాలుగు జట్లను వచ్చే ఏడాది అర్హత టోర్నమెంట్‌లో తేల్చనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -