– వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల కోసం ఆందోళన
లాహోర్ : పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని కార్మికులు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. 140 అమెరికా డాలర్లను నెలకు కనీసం వేతనంగా ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ అనేక మంది ఫ్యాక్టరీ యజమానులు ప్రపంచ మార్కెట్ను సాకుగా చూపుతూ వేతనాలు తగ్గించారు. దీంతో కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలని, పని పరిస్థితులను తక్షణమే మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని ఫైసలాబాద్, గుజ్రాన్వాలాలోని వేలాది మంది లూమ్, టెక్స్టైల్, బట్టీ కార్మికులు జులై చివరి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.
దీంతో కొంత మంది యజమానులు అక్రమ ఫ్యాక్టరీ లాకౌట్లకు పాల్పడుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కీలకమైన వస్త్ర రంగంలో ప్రతిష్టంభన నెలకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వస్త్ర పరిశ్రమకు చెందిన 25 శాతం కార్మికులు పనిచేసే పైసలాబాద్ పవర్ లూమ్ రంగం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది.
ఈ ప్రాంతంలో కార్మికులకు వేతనాలు తగ్గింపుతో పాటు, అనేక మందికి సామాజిక భద్రతా నమోదు నిరాకరించారు. అలాగే, ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, చికిత్సా పరిహారం కూడా అమలుకావడం లేదు. దీంతో కార్మికులు తమ నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 1 నుంచి పైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘పని ఇవ్వండి లేదా మరణం ఇవ్వండి’ అని నినాదాలు చేస్తున్నారు.