– 9,326 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం
– ‘మా పాప – మా ఇంటి మణి దీపం’ పై జిల్లా కలెక్టర్కు అభినందన
– రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రజా పాలన అందిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఖమ్మంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు భట్టి విక్రమార్క హాజరై జెండా ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పాలన లక్ష్యాలుగా తెలంగాణ రైజింగ్ -2047 విజన్ పాలసీ రూపొందించామన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రా అండ్ ఇండిస్టియల్, టూరిజం పాలసీలను సిద్ధం చేసిందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణహిత ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించిందని, ఇందులో భాగంగా 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి, గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామన్నారు. జిల్లాలో 9,326 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిందన్నారు. మధిర నియోజకవర్గంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంచేందుకు ఇందిరామహిళా డెయిరీ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. దీనిలో భాగంగా 21 వేల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రెండు పాడి గేదెలను ఇచ్చామన్నారు. ఈ డెయిరీ ద్వారా వచ్చే లాభాలనూ సంఘ సభ్యులకు జమ చేస్తామని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్లో 229 కోట్లతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులు తుది దశలో ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వురు కెన్ లెర్న్ ద్వారా ఆంగ్ల నైపుణ్యాల పెంపునకు కృషి చేశామని, గతేడాది 34 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం అన్ని ప్రభుత్వం స్కూళ్లలో చేపట్టనున్నట్టు తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా రూ. 100 కోట్లతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి లక్షా 25 వేల ఎకరాలను స్థిరీకరించా మన్నారు. పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. భూ యాజమాన్య హక్కులు పరి రక్షించడానికి భూ భారతి చట్టాన్ని ఏప్రిల్ 14, 2025న ప్రవేశ పెట్టిందని, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి 3,224 దరఖాస్తులను స్వీకరించి సమస్యలను పరిష్కరించామన్నారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని రెండవ పైలట్ మండలంగా ఎంపిక చేశామన్నారు. ”మా పాప- మా ఇంటి మణిదీపం” అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ను అభినందించారు. మున్నేరు నదిపై రూ.180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పురోగతిలో ఉందని తెలిపారు. ఖిలా రోప్ వే, పాలేరు లేక్ పార్క్, నేలకొండపల్లి బౌద్ద స్తూపం, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం సన్మానించారు.
సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES