నవతెలంగాణ – భువనగిరి: యువత పొగత్రాగుడుకు బానిసలు కాకూడదని, వారి శక్తి, విజ్ఞానం దేశ సంపదని, సరదాగా అలవాటు చేసుకుంటే అది ఒక వ్యసనం లాగ మారి ప్రాణాన్ని, జీవితాన్ని ఛిద్రం చేస్తుందని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, ఇన్చార్జ్ అధ్యక్షులు ముక్తిదా తెలిపారు. శనివారం భువనగిరిలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బహిర్గత ధూమపానం నిషేధింపబడిందని, దీనిని అతిక్రమిస్తే రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛా హక్కును కాలరాయటమే అని తెలిపారు. పొగాకును అందరు విడనాడాలని దీనిని మాన్పించటంలో అందరు కృషి చేయాలి అని తెలిపారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ మరియు ఇంచార్జి కార్యదర్శి ఎన్. శ్యామసుందర్ మాట్లాడుతూ పొగ త్రాగటం ఒక మానసిక రుగ్మతన్నారు. దీనిని మానివేయాలంటే తమకు తామే కౌన్సిలింగ్ చేసుకొని పొగ త్రాగే అలవాటు స్వయంగా మానుకోవాలన్నారు. పొగ త్రాగుట వలన అనారోగ్యం పాలై తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని జీవితమే నష్ట పోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ జి. స్వాతి మాట్లాడుతూ పొగాకుకు బానిసలు కాకూడదని ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు, గ్రామీణ, పట్టణ వాసులలోని యువతకు కౌన్సిలింగ్ నిర్వహించి పొగాకు మాన్పించటంలో కృషి చేయాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మానసిక ఆరోగ్య కార్యాక్రమ అధికారి డా. ప్రీతి స్వరూప్ పొగ త్రాగటం, హుక్కా , పొగాకు నమలడం వంటి వాటికి బానిసలైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు మరియు క్యాన్సర్ బాధితులుగా మారే విషయాలపై అవగాహన కల్పించి, జిల్లా ఆరోగ్య మరియు వైద్య శాఖ ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వి.వి.గౌడ్ మరియు జనరల్ సెక్రటరీ బొల్లేపల్లి కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ జి. శంకర్ లు పొగ త్రాగుట విడనాడాలన్నారు. సంబంధిత చట్టాలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. న్యాయమూర్తులు పొగాకు నిర్మూలనకై అవగాహన ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యాక్రమములో పాల్గొన్న పారా లీగల్ వాలంటీర్లకు తగిన ప్రచారం కోసం అందచేశారు. భువనగిరి కోర్ట్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్స్ , కక్షిదారులు పాల్గొన్నారు.
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES