Tuesday, July 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపసుపుబోర్డు సరే..నిధులేవి?

పసుపుబోర్డు సరే..నిధులేవి?

- Advertisement -

ముందస్తు అరెస్టులు దుర్మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నిజామాబాద్‌లో పసుపు బోర్డు పనుల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకు వామపక్ష పార్టీలు పిలుపులివ్వలేదని తెలిపారు. అయినా సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబుతో పాటు, మిగతా నాయకులను, కార్యకర్తలను, ఇతర వామపక్ష పార్టీల నాయకులను ముందురోజే అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గమని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే పద్ధతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి చర్యలకు పూనుకోవటం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామంటూ అమిత్‌ షా మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న సీట్లే గల్లంతవుతాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసిందని గెలుస్తామని కలలుగంటుందో స్పష్టం చేయాలని నిలదీశారు.

నిజామాబాద్‌ ప్రాంతంలో పసుపు ఎక్కువ ఉత్పత్తి అవుతుందని అమిత్‌షా చెప్పినప్పటికీ, ఆ బోర్డుకు కావాల్సిన యంత్రాలు తదితర పరికరాలకు ప్రతిపాదనలు, కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పసుపు బోర్డు ప్రాంతంలోని రైతుల సమస్యలపై, కనీస మద్దతు ధరపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవటం బీజేపీ రాజకీయ విధానంలో భాగమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులివ్వలేదనీ, జాతీయ హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి, రైల్వే కోచ్‌ ఏర్పాటుకు నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్‌శంకర్‌, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌ అడవి ప్రాంతంతో పాటు, ఆసిఫాబాద్‌లోని 10మండలాల్లో దాదాపు ఏడు లక్షల ఎకరాల భూమినంతా కాజేసీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి, గిరిజనులనంతా ఆ ప్రాంతాల నుంచి తరిమేసే కార్యక్రమానికి పూనుకుంటున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోను తెచ్చిందనీ, రాష్ట్ర అభివృద్ధికి, హక్కులకు, నిధులకు, సామాజిక న్యాయానికి, రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తున్న బీజేపీని ఓడిరచడానికి సీపీఐ(ఎం)తో సహా, ఇతర వామపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -