మోడీకి మాటిచ్చాను.. సక్సెస్ కావాలి
అధికారులకు చంద్రబాబు దిశా నిర్ధేశం
రాష్ట్రంలో లక్షచోట్ల… 2 కోట్ల మందికి పైగా యోగా డేలో భాగస్వామ్యం
విశాఖ : యోగాను రాష్ట్రంలో ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ నెల 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరుగుతుండటం, ప్రధాని హాజరుకానుండటం నేపథ్యంలో ఆ ఏర్పాట్ల పరిశీలనకు సిఎం సోమవారం విశాఖకు విచ్చేశారు . ఆర్కె బీచ్ రోడ్డులోని కాళీమాత టెంపుల్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లును స్వయంగా పరిశీలించారు. ఎయు సహా విశాఖలో యోగా డే జరిగే ప్రధాన ప్రాంతాలన్నింటినీ సిఎం కలియదిరిగారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. యోగా డే విజయవంతానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రపంచ రికార్డు సాధించాలన్న దిశగా ప్రణాళిక ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘యోగాడేను సక్సెస్ చేస్తాం అని ప్రధాని నరేంద్ర మోడీకి మాటిచ్చాను. అందరు దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజువారీ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా మంచి మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి యోగా ఒక మార్గమన్నారు. వేడుకలలో భాగంగా విశాఖలో ఒక ప్రాంతంలోనే మూడు లక్షల మంది యోగా చేయనున్నారని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాలతో కలుపుకొని మొత్తం ఐదు లక్షల మంది భాగస్వాములవుతున్నారని అన్నారు. ప్రధాని దేశ వ్యాప్తంగా లక్ష ప్రాంతాల్లో యోగా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటన్నింటిలో కలిపి సుమారు రెండు కోట్ల మంది పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్లా 17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న 25 లక్షల మందికి సర్టిఫికెట్లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రావలసిందిగా గిన్నిస్ రికార్డు వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. మొత్తం 326 కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశామని, ఒక్కోదానిలో వెయ్యి మంది చొప్పున యోగా చేయనున్నారని, ప్రతిచోటా వలంటీర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొన్నేందుకు విశాఖకు తీసుకురానున్నామన్నారు. ఇండియన్ నేవీ వారు 11 భారీ నౌకలలో యోగాసనాలు వేసి కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నట్టు తెలిపారు. బీచ్ రోడ్డులో యోగా వేడుకలకు ఏదన్నా వాతావరణ సమస్య ఏర్పడితే ప్రధాన వేదికను ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కు మార్చేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. సిఎం వెంట మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజ నేయ స్వామి, పార్థసారధి, అనిత, యోగాంధ్ర – 2025 నోడల్ అధికారి ఎమ్టి.కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేందిర ప్రసాద్ ఉన్నారు.
ప్రజా ఉద్యమంగా యోగా
- Advertisement -
- Advertisement -