– కొత్త కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్
– మినిమమ్ బ్యాలెన్స్
– ఐదు రెట్లు లేకుంటే చార్జీల బాదుడు
ముంబయి: పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తుంటే.. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మాత్రం అందుకు భిన్నంగా కస్టమర్లకు షాకిచ్చింది. సేవింగ్ అకౌంట్లలో కనీస సగటు నిల్వ మొత్తాన్ని పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బర్, గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1 తర్వాత సేవింగ్స్ ఖాతా తెరిచే కస్టమర్లకు వర్తించనుంది. ఇప్పటికే ఉన్న ఖాతాదా రులకు వర్తించదు. మారిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసీఐసీఐ సేవింగ్ అకౌంట్ తీసుకునేవారు తమ సగటు నిల్వలను కనీసం రూ.50వేలు ఉంచాలి. గతంలో ఈ పరిమితి రూ.10వేల వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది. ఇక, సెమీ అర్బన్ కస్టమర్ల కనీస సగటు నిల్వ మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.25వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదారులకు రూ.2,500 నుంచి రూ.10వేలకు పెంచేసింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, కొత్త నిబంధనల ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో చార్జీలు కట్టాల్సి ఉంటుందని ఐసీఐసీఐ వెల్లడించింది.ప్రస్తుతం దేశీయ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్న కనీస సగటు నిల్వ మొత్తం నిబంధనల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. హెచ్డీఎఫ్సీలో గరిష్ఠంగా రూ.10వేల కనీస నగదు నిబంధనను (మెట్రో/అర్బన్ నగరాల్లో) అమలుచేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్లో అయితే ఈ మొత్తం రూ.12వేలు (మెట్రో/అర్బన్)గా ఉంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఆయా కస్టమర్ల నుంచి బ్యాంకులు కొంత మొత్తంలో చార్జీలు వసూలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ చార్జీల నుంచి కొన్ని బ్యాంకులు మినహాయింపు కల్పించి ఖాతాదారులకు ఊరట కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ.. 2020లోనే ఈ అపరాధ రుసుము నిబంధనను ఎత్తివేయగా.. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఈ చార్జీలను తొలగించాయి.
సేవింగ్స్ అకౌంట్లో రూ.50 వేలు ఉండాల్సిందే
- Advertisement -
- Advertisement -