వారి మరణాల్లో సూసైడ్లే అధికం
పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ : ‘కాజ్ ఆఫ్ డెత్ నివేదిక
2020-22′ విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో చోటు చేసుకునే మరణాల్లో ఆత్మహత్యల వాటా ఆందోళన కలిగిస్తున్నది. దేశ యువత విషయంలో ఈ పరిస్థితి తీవ్రత అధికంగా ఉన్నది. భారతీయ యువత (15-29 ఏండ్లు) మరణాలలో సూసైడ్లు అధికంగా ఉన్నాయి. అందులోనూ పురుషుల కంటే మహిళల ఆత్మహత్యల సంఖ్యే ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ‘కాజ్ ఆఫ్ డెత్’ తాజా నివేదిక 2020-22 విశ్లేషణ ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. ఈ ఏజ్ గ్రూపులో ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి, అంటే 17.1 శాతం ఆత్మహత్యల ద్వారానే కావటం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా యువత మరణాల్లో ఆత్మహత్యలది మూడో స్థానంగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. భారత్లో గత రెండు దశాబ్దాలుగా యువత మరణాలకు ప్రధానమైన రెండు కారణాలలో ఆత్మహత్య ఒకటిగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
అన్ని ఏజ్గ్రూపుల్లో ‘ఆత్మహత్య’కు చోటు లేదు
దేశవ్యాప్తంగా అన్ని ఏజ్గ్రూపులలో మరణాలకు టాప్-10 కారణాల్లో ‘ఆత్మహత్య’ లేదు. ఇందులో హృదయ సంబంధ వ్యాధులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు ఉన్నాయి. దేశ యువత ఆత్మహత్యలతో మరణాలకు గురవుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి
యువత మరణాల్లో టాప్-5 కారణాలు
భారత్లోని అన్ని మరణాల్లో 15-29 ఏండ్లున్న ఏజ్ గ్రూప్ వాటా ఐదు శాతంగా ఉన్నది. వీరి మరణాల్లో సూసైడ్లు, రోడ్ యాక్సిడెంట్లు మొదటి రెండు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హృదయ సంబంధ వ్యాధులు, అనుకోకుండా అయ్యే గాయాలు(రోడ్లు యాక్సిడెంట్లు కాకుండా పడిపోవటం, మునిగిపోవటం, జంతువుల కాటు, కాలిన గాయాలు, వైద్య, శస్త్ర చికిత్స సమస్యలు), జీర్ణ సంబంధ వ్యాధులు, శ్వాసకోశసంబంధ ఇన్ఫెక్షన్లు, అన్ని ఇతర కారణాలు ఉన్నాయి.
ఎన్సీఆర్బీ ప్రకారం ఇలా..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ప్రకారం.. 18-30 ఏండ్లున్నవారిలో ఆత్మహత్యలకు ఐదు ప్రధాన కారణాల్లో కుటుంబ సమస్యలు (32.4 శాతం), ప్రేమ వ్యవహారాలు (8 శాతం), వివాహ-సంబంధమైనవి (7.5 శాతం), మానసిక అనారోగ్యం (7.4 శాతం), మాదక ద్రవ్యాల వినియోగం (5.2 శాతం) వంటివి ఉన్నాయి. ఇక వివాహ సంబంధ ఆత్మహత్యల్లో వరకట్న సంబంధ సమస్యలే 28 శాతంగా ఉన్నాయి. ఇందులో 93 శాతం మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోవటం గమనార్హం.
పదో స్థానంలో భారత్
15-29 ఏండ్ల వయసున్నవారిలో ఆత్మహత్య మరణాల సంఖ్య (60,700 కంటే ఎక్కువ) భారత్లోనే అత్యధికంగా ఉన్నది. అయితే, ఈ వయసు గలవారు భారత్లో అత్యధిక సంఖ్యలో (34.5 కోట్ల మంది) ఉండటం గమనార్హం. పెద్ద దేశాల్లో, భారత్ అత్యధిక ఆత్మహత్య రేటు 15.7తో టాప్-10 దేశాల్లో పదో స్థానంలో ఉన్నది. ఇది భారత పొరుగు దేశాల కంటే ఎక్కువే. ఈ జాబితాలో ఉరుగ్వే, దక్షిణాఫ్రికా, రష్యాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
మహిళల ఆత్మహత్యలు పురుషుల కంటే ఎక్కువ
యువత మరణాల్లో ఆత్మహత్యల వాటా మహిళలది అత్యధికంగా 18.2 శాతంగా ఉన్నది. పురుషుల విషయంలో ఇది 16.3 శాతంగా నమోదైంది. 2010-13 మధ్య అత్యధికంగా 21.8 శాతం మంది మహిళలు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పురుషుల ఆత్మహత్యల వాటా 15 శాతంగా ఉన్నది. దాదాపు పదేండ్లలో స్త్రీ, పురుషుల మధ్య ఆత్మహత్యల్లో అంతరం తగ్గటం గమనించాల్సిన అంశం.
