నవతెలంగాణ-హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. జుబీన్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన హత్యకు గురయ్యారంటూ అసెంబ్లీలో వెల్లడించారు. గాయకుడి మృతిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం సందర్భంగా సీఎం ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ‘జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు. ఆయన్ని హత్య చేశారు’ అని వ్యాఖ్యానించారు.
52 ఏండ్ల సింగర్ జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సింగర్ మృతిపై సీఎం హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు. డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది. ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఈ కేసులో జుబీన్ మేనేజర్, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.



