‘చే- అంటే ఒక ఉత్సహం,
‘చే- అంటే ఒక ఉత్తేజం,
‘చే- అంటే ఒక విప్లవం
‘చే- అంటే ఒక సాహసం,
‘చే- అంటే ఒక వివేచన,
‘చే- అంటే ఒక ఆచరణ
‘చే- అంటే ఒక విముక్తి పోరాటం,
ఆ పేరు ఒక నినాదం,
ఆయన జీవితం ఒక పాఠం
చే పేరు చెబితేనే కళ్లముందు ఆయన రూపం కనిపిస్తుంది. ఆకుపచ్చ సైనిక దుస్తులు, తలపై మిలటరీ క్యాప్, దానిపై ఐదు కోణాల నక్షత్రం, సన్నని గడ్డం- మీసాలు, తేజోవంతమైన ముఖం.ఒకసారి హవానా చుట్టతో, మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనబడే చేగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది. విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి, ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు. ఆయన జయంతి సందర్భంగా చే జ్ఞాపకాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం…
ఏర్నెస్టో ‘చే’ గువేరా ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతవేత్త, క్యూబా విప్లవంలో ప్రముఖ వ్యక్తి. 1928లో జన్మించిన ఆయన యుక్త వయసులోనే లాటిన్ అమెరికా అంతా పర్యటించి, అక్కడి దారిద్యం అసమానతలను చూసి చలించిపోయాడు. ఈ అనుభవాలు ఆయనలో విప్లవ భావాలను రగిలించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వర్గ దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయాలని జీవించినంత కాలం పరితపించిన వ్యక్తి ‘చే. అంతర్జాతీయ శ్రామికవర్గ పోరాటాలకు ఊపిరులూదిన చే ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు. బొలీవియా సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడుతూ శత్రుసేనల దొంగదెబ్బకు బలి అయ్యాడు. ప్రజల గుండెల్లో ధవతారగా నిలిచాడు.
చే అంటే విప్లవం
చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా. బతుకు దెరువు కోసం ఐర్లాండ్ నుంచి స్పెయిన్కు, అక్కడ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లింది ఆ కుటుంబం. రెండేళ్ల వయస్సులోనే చేకు ఆస్తమా వచ్చింది. దీంతో పసివాడికి ఏమౌతుందో అన్న భయంతో తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా? అవును. ఈ పసివాడే నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్లకు నిద్ర లేకుండానూ చేశాడు.
చిన్నప్పటి నుంచే విప్లవకారుల జీవిత చరిత్రలు, వారి వీర గాథలను తల్లి సెలియా చేకు నూరిపోసేది. పెట్టుబడిదారీ వర్గం, దోపిడీదారీ సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు చే. తల్లిదండ్రుల విప్లవ మార్గం చే పై ప్రభావం చూపింది. అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు. అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. చేగువేరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తి కలిగించాయి. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ను ముందుకు కదిలేలా చేశాయి. వైద్యుడైతే ప్రజా సేవతో అందరినీ కలవొచ్చనుకున్నాడు. అంతే ఇంజనీరింగ్ విద్యకు స్వస్తి పలికి… స్టెతస్కోప్ పట్టాడు. ఎనిమిది నెలల తన అర్జెంటీనా యాత్రతో ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు. ఈ సమయంలో లాటిన్ అమెరికా దేశాలు 1953, జూలై 7న బ్యూనస్ ఎయిర్స్ రైల్వేస్టేషన్ నుంచి గువేరా బయలుదేరారు.
కాస్ట్రో సోదరులతో పరిచయం
అమ్మనాన్నలు చేకు వీడ్కోలు పలికా రు. అతను వెళుతోంది డాక్టర్గా కాదు, సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు. అందుకే చే విప్లవకారుని అవతారమెత్తాడు. గ్వాటెమాలలో కొన్నాళ్లపాటు రహస్య జీవితం గడిపిన చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడారు. అక్కడే సహ ఉద్యమకారిణి హిల్దా అకోస్టా పరిచయమైంది. వారికి పుట్టిన అమ్మాయి హిల్దితా.
గ్వాటెమాల అధ్యక్షులు ఆర్బెంజ్ గుజ్మెన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చే, అతని భార్య హిల్దాలు పాల్గొన్నారు. చేను విప్లవకారునిగా, హంతకునిగా ముద్రవేసిన సైనికులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. సైనిక నియంత వద్దకు అతన్ని తీసుకు వెళ్లేలోపే తప్పించుకున్నాడు చే. హిల్దా జైలులో ఉన్నా.. కొద్దికాలం తర్వాత విడుదలైంది. తర్వాత గ్వాతెమాలా సరిహద్దులు దాటిన చే.. మెక్సికో వైపు అడుగులు వేశాడు. అక్కడే క్యూబా విప్లవ వీరులు ఫైడల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది. తాను క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు చే. ఇందుకు కాస్ట్రో అనుమతి లభించింది. గ్రాన్మా అనే చిన్న పడవలో హవానా వైపు బయలుదేరిన 20 మంది విప్లవీరులను సైన్యం చుట్టుముట్టింది. వారిలో ఇద్దరినీ హతమార్చింది. మరికొందరిని పట్టుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకున్నారు గెరిల్లా దళసభ్యులు. ఈ సంద్భంగా సైన్యం, గెరిల్లా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చేగువేరా భుజానికి గాయమైంది. మెడకు తుపాకీ బానెట్ దెబ్బ తగిలింది. అయినా లెక్కచేయక సైనికులతో పోరాడాడు చే. నెత్తుటి గాయాలను సైతం లెక్క చేయక శత్రు సైన్యాన్ని తరిమికొట్టాడు. ఆ తాత్కాలిక విజయంలో చే కషి వెలకట్టలేనిది. ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విప్లవవీరులు హవానా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు.
క్యూబా బాధ్యతలు
అమెరికా కీలు బొమ్మ అధ్యక్షుడు బటిష్టా ఓటమిని ఒప్పుకున్నాడు. దేశం విడిచి వెళ్లాడు. ఫలితంగా 1959 జనవరి 1న ఫైడల్ కాస్ట్రో నాయకత్వాన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. క్యూబాలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫైడల్ కాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు. విదేశాంగ వ్యవహారాలతో పాటు.. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కర్తవ్యాన్ని చేకు అప్పగించారు కాస్ట్రో. అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చేగువేరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది. విదేశీ వ్యవహారాల్లో భాగంగా చేగువేరా 1959 జూన్ 12 నుంచి సెప్టెంబరు 14 వరకు 14 దేశాల రాజ్యాధినేతలతో చర్చలు జరిపారు. చే చర్చలు జరిపిన వారిలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీనే కాదు.. ఈజిప్టు, ఇండోనేషియా, పాకిస్తాన్, యుగోస్లోవియా దేశాల అధ్యక్షులు ఉన్నారు. విదేశాల్లో తిరగడం, వాతావరణం అనుకూలించకపోవడం చే ఆరోగ్యం పై ప్రభావం చూపింది. ఫలితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే చేగువేరా గెరిల్లా యుద్ధం అనే పుస్తకాన్ని రాశారు.
కమ్యూనిస్టు కంచుకోటలైన చైనా, రష్యా దేశాల్లో చేగువేరా పర్యటించారు. అక్కడి నేతలతో చర్చలు జరిపి కార్మికులు, కర్షకుల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. క్యూబాలోను అలాంటి ప్రణాళికలు అమలు అయ్యేలా చూడాలని కాస్ట్రోను కోరడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చే 1964 డిసెంబర్ 11న క్యూబా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టాడు. సభ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. వచ్చిన అవకాశాన్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టే సాహసం చేశారు. అటు తర్వాత చేగువేరా అల్జీరియా పర్యటించారు. అల్జీరియా పర్యటన ముగించుకుని వచ్చిన చే హవానాలో చివరిగా కాస్ట్రోను కలిశాడు. క్యూబా విముక్తితో తన పని పూర్తి కాలేదని చెప్పారు. మరో దేశ విముక్తి పోరాటంలో పాల్గొంటానని వివరించారు. ఇందుకు కాస్ట్రో అభ్యంతరం చెప్పినా.. తన కర్తవ్య దీక్షను వీడేది లేదని పట్టుపట్టాడు చేగువేరా. మరో మార్గం లేక కాస్ట్రో అతనికి అడ్డుచెప్పలేదు.
కాంగో, బొలివియా విముక్తి పోరులో…
కాంగో విముక్తి కోసం చెగువేరా వెళ్లిన విషయం కాస్ట్రో, రౌవుల్ కాస్ట్రోతో పాటు కుటుంబ సభ్యులకే తెలుసు. చివరగా కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నాకే కాంగోలో అడుగుపెట్టారు చే. అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రహస్యంగా యుద్ధ తంత్ర వ్యూహాలు రచించారు చే. ఇందుకు స్థానిక విప్లవకారుల సహకారం తోడైంది. కొద్దికాలంపాటు.. పోరాటం చేసినా.. సైనిక నియంతల ఆగడాల ముందు విప్లవవీరుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. విప్లవవీరులు ఒక్కొక్కరుగా సైన్యం చేతికి చిక్కారు. మిగిలిన కొద్ది మందితో కలిసి చేగువేరా తిరిగి హవానా చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయాలను కాస్ట్రోకు వివరించాడు చే. ఈసారి కాంగోకు బదులు.. బొలీవియాను ఎంచుకున్నాడు తన కేంద్రంగా. 1966 అక్టోబరు 23న చేగువేరా తన జీవితంలోని చివరిగా కాస్ట్రోను రహస్యంగా కలిశారు. వేషం, భాష మార్చి ప్యాంట్, పొడవాటి షర్ట్తో ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఉరుగ్వే మీదుగా బొలీవియా చేరుకున్నారు. క్యూబా విప్లవవీరులు, బొలీవియా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, స్థానికుల సహకారం తోడైంది.
నేలకొరిగిన విప్లవ సింహం
1959లో భారత్ పర్యటించినప్పుడు సైతం చే నిజాన్ని నూటిగా చెప్పడానికి వెనుకాడలేదు. ”150 ఏళ్ల సామ్రాజ్యవాద పాలనకు తెరపడింది. కానీ భారత్లో ఇంకా పేదరికం తాండవమాడుతూనే ఉంది. ఎక్కువ భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటమే దీనికి కారణం. సామాజిక న్యాయం సాధించాల్సిన లక్ష్యం ఇంకా మిగిలే ఉంది.” మనదేశంలో ఇప్పటికీ అదే పరిస్థితే ఉంది. 1985 ఆల్జీరియాలో చివరిసారిగా చే బహిరంగంగా కనిపించాడు. చే తిరిగి క్యూబాకు వెళ్లలేదు. అప్పటికే తన ‘వీడ్కోలు లేఖ’ను రాశాడు. ప్రపంచ విప్లవాన్ని విజయవంతం చేయడానికే తన జీవితాన్ని అర్పిస్తున్నానని స్పష్టం చేశాడు. బొలీవియాలో విప్లవకార్యకలాపాలు ప్రారంభించాడు. సీఐఏ సమాచారంతో 1967 అక్టోబర్ 8న బొలివియా సేనలు భారీ ఎత్తున తరలి చే మకాంను చుట్టుముట్టి దాడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ చేగువేరాను బంధించాయి. ఇంటరాగేట్ చేయడానికి వచ్చిన అధికారులపై ఉమ్మి సత్కరించిన ఆయనను అక్టోబర్ 9న కాల్చి చంపేశారు. అక్టోబర్ 18న క్యూబా రాజధాని హవానాలో పది లక్షల మంది క్యూబన్లు ‘చే’ కు నివాళులర్పించారు.
నేటి యువత మత్తులో చిత్తు అవుతూ, లైంగిక దాడులతో ఉన్మాదులుగా మారుతున్నారు. మతోన్మాద పెట్రేగిపోతూ యువత భవితను నాశనం చేస్తున్న నేటితరుణంలో ‘చే మార్గాన్ని స్వీకరించి అసమానతలు లేని భవితను నిర్మించాల్సి ఉంది. ఈ విప్లవవీరుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయనేది నిజం.
భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి అర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్థాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ ఐకాన్గా మారి వారి టీ షర్టులపైనో, టోపీలపైనో దర్శనమిస్తున్న చేగువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన్ని ఎరగక పోవడం కనీస వ్యవహారిక జ్ఞానాన్ని ఇవ్వలేని నేటి విద్యా విధానపు వైఫల్యానికి కొండంత రుజువు. చే జీవితంలోకి తొంగి చూసిన వారెవరైనా… ఆయనను గుండెలపైనే కాదు, గుండెలలోనూ దాచుకోకుండా ఉండలేరు. జీవితం విలువను ఎరిగినవాడు కాబట్టే చే తన గుండె నెత్తురుతో పీడిత జన విముక్తి బాటలు వేశాడు. తన జీవితాన్నే పోరుగా మలిచి ఉద్యమ వెలుగెయ్యాడు. అలాంటి ‘చే’ జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అనివార్యత మున్నెన్నటికన్నా నేడు ఎక్కువగా ఉంది. నేటి తరం చేగువేరా జీవితాన్ని, ఆచరణను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జీవితాంతం ప్రజల బాగు కోసం పరితపించిన వేగు చుక్క నేడు మనకు చే ‘యువత.
– అనంతోజు మోహన్కృష్ణ 88977 65417