నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించిన మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. “శుభక్షేత్ర” అనే పేరుతో వెంచర్లు వేసి, అధిక లాభాలు ఆశజూపి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు రామావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరు , దామరగిద్ద ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ఈ దందా సాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అయితే, బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత నిందితుల అసలు స్వరూపం బయటపడింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని కోరగా, కేవలం ఒప్పంద పత్రాలతోనే కాలయాపన చేస్తూ బాధితులను తిప్పించుకోవడం మొదలుపెట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) , తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం (TSPDFEA) కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం రామావత్ మధును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



