భట్టి సమక్షంలో ప్రకటించిన జేఏసీ
కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ట్రాన్స్కో సీఎండీకి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత పది రోజులుగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న కార్మికులు ఎట్టకేలకు విరమించారు. నేటి నుంచి విధుల్లోకి హాజరవుతా మని ప్రకటించారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి ప్రకటించారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోతో పాటు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీస్రేట్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం విదితమే. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయాలనీ, నిలిచిపోయిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలనీ, ప్రమాదకరమైన విధుల్లో పాల్గొనే తమకు మెరుగైన ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని మొదలగు డిమాండ్లను జేఏసీ ప్రతిపాదించింది. ఇందులో ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం విధానపమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా భట్టి కార్మికులకు వివరించారు. ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్కో సీఎండీ చర్చలు జరుపుతారని తెలిపారు. తమ సర్కార్ ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ఆలోచన చేస్తుందన్నారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వారికి హామీ ఇచ్చారు. చర్చల్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మెన్లు శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మెన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విరమించిన ఆర్టిజన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



