చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో నిందితునికి శిక్ష
రూ.30 వేల జరిమానా నల్లగొండ అదనపు జడ్జి-2 తీర్పు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
చిన్నారిపై లైంగికదాడి ఘటన పోక్సో కేసులో నల్లగొండ అదనపు జడ్జి-2 సోమవారం నిందితునికి 21 ఏండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్టు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు మూడో తరగతి చదువుతున్న బాలిక(8)పై 11.02.2018న లైంగికదాడి చేశాడు. బాధితురాలి తండ్రి చిట్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితునిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు పూర్తి విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు జడ్జి-2, ఎస్సీ ఎస్టీ కోర్టు, పోక్సో కేసుల కోర్టు నిందితున్ని దోషిగా నిర్ధారించింది. 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించారు. సెక్షన్ 448 ఐపిసి ప్రకారం ఏడాది జైలు, రూ.5000 జరిమానా మొత్తం 21 ఏండ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువడించింది. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి నిందితునికి శిక్ష పడేలా చేసిన దర్యాప్తు ఆఫీసర్ సీఐ పాండురంగారెడ్డి, ఎస్ఐ సైదాబాబు, ప్రాసిక్యూషన్కు సహకరించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ నాగరాజు, నార్కట్పల్లి ఎస్ఐ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్కుమార్, సీడీసీ యాదయ్య, లైజన్ అధికారులు, లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన, పి.నరేందర్, ఎన్ మల్లికార్జున్ను ఎస్పీ అభినందించారు.