యూజీసీ హెచ్చరిక
మోడీ సర్కార్ సైలెంట్ ఎందుకు? : విద్యార్థి సంఘాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వపరంగా గుర్తింపు ఉన్న చదువులకు ప్రాధాన్యత దక్కటంలేదన్న ఆవేదన నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు నకిలీ వర్సిటీలు పుట్టగోడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. తాజాగా 22 ఫేక్ వర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే.. కోట్లాది రూపాయలు దండుకుంటుంటే మోడీ సర్కార్ ఎందుకు గమ్మునుంటుం దనే చర్చ నడుస్తోంది. యూజీసీ కూడా కేవలం ఫేక్ వర్సిటీల వివరాలు ప్రకటించి చేతులు దులుపుకుంటుంటే.. దీని వెనుక రాజకీయ,ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులకు ఎంతగా ముడుపులు అందుతున్నాయోనన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
నకిలీ వర్సిటీల చిట్టా..
ఢిల్లీ కోట్లా ముబారక్పుర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని పేర్కొంది. ఆ సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు సంబంధించి ఏ చట్టం కింద ప్రారంభించలేదని యూజీసీ స్పష్టం చేసింది. యూజీసీ డేటా ప్రకారం దేశంలో 22 గుర్తింపులేని యూనివర్సిటీలను నిర్వహిస్తున్నారని తేలింది. వీటిల్లో 9 దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయి. ఐదు ఉత్తర్ప్రదేశ్లో ఉండగా.. మిగిలినవి కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిల్లో నిర్వహిస్తున్నట్టు యూజీసీ గణాంకాలు చెబుతున్నాయి.
యూజీసీ వెల్లడి..
ఢిల్లీలోని విద్యార్థులను బ్రోకర్ నెట్వర్క్లతో మాయచేసి.. ఈ విశ్వవిద్యాలయాలు ఆకర్షిస్తున్నాయి. తమ సంస్థలకు పేర్లు పెట్టే సమయంలో ‘నేషనల్’, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ వంటి పదాలు వాడుతున్నారు. ఇక యూపీలో విద్యాపథ్, పరిషద్, ఓపెన్ యూనివర్సిటీ వంటి పదాలను వినియోగిస్తున్నారు. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే సమయంలో దాని పేరు సెక్షన్ 2(ఎఫ్) లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్ఎంసీ వంటి కౌన్సిల్స్ నుంచి ఆయా సంస్థల్లో ఏ కోర్సుల నిర్వహణకు అనుమతులు లభించాయో సరిచూసుకోవాలి. ప్రకటించింది. వాస్తవానికి ఇలాంటి నకిలీ వర్సిటీలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని విద్యార్థి సంఘాలు పేర్కోంటున్నాయి.



