డోపింగ్లో అగ్రస్థానంలో భారత్
వాడా 2023 గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ : క్రీడల్లో సూపర్పవర్గా ఎదిగేందుకు చూస్తున్న టీమ్ ఇండియా.. డోపింగ్లో టాప్ లేపింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) గురువారం 2023 గణాంకాలు విడుదల చేయగా.. అత్యధిక పాజిటివ్ కేసులు భారత్లోనే వెలుగుచూశాయి. 2023లో ది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) 5606 శాంపిల్స్ను పరీక్ష చేయగా.. అందులో 213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2019లో నాడా 4004 శాంపిల్స్ను పరీక్ష చేయగా.. అందులో 224 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో భారత అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడటం ఇదే ప్రథమం. అథ్లెటిక్స్లో 61 పాజిటివ్ కేసులు రాగా.. పోటీల సందర్భంగా 47 కేసులు, ఇతర సమయంలో 13 కేసులు నమోదయ్యాయి. వెయిట్లిఫ్టింగ్లో 26 మంది పాజిటివ్ తేలగా.. పవర్లిఫ్టింగ్ (28), రెజ్లింగ్ (10), జూడో (6), సైక్లింగ్ (6), పారా అథ్లెటిక్స్ (5) పాజిటివ్ కేసులో వచ్చాయి. బాడీబిల్డింగ్లో 7 శాంపిల్స్ను పరీక్షించగా.. అందులో ఐదు పాజిటివ్గా తేలాయి. వాడా నిబంధనల ప్రకారం శాంపిల్ (యూరిన్, బ్లడ్) టెస్టులో పాజిటివ్గా తేలినా.. అథ్లెట్ మెడికల్ హిస్టరీ, ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లు, వ్యాధి సంబంధిత బ్యాక్గ్రౌండ్, సప్లిమెంట్స్ వినియోగం, నిషేధిత ఉత్పేరకాల వాడకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డోపింగ్ శిక్షలు ఖరారు చేస్తారు.
5606 శాంపిల్స్, 213 పాజిటివ్
- Advertisement -
- Advertisement -