నవతెలంగాణ-హైదరాబాద్ తెలంగాణ : ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకు రేషన్ కార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ రేషన్ కార్డు ద్వారా పదుల సంఖ్యలో పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా వేలాది మంది ప్రజలు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకొని రేషన్ తీసుకోవడం లేదు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు.
ఇందులో గడిచిన ఆరు నెలల్లో ఒక్కసారి కూడా రేషన్ తీసుకొని 78,842 రేషన్ కార్డులు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మొత్తం కార్డులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ తీసుకొని వారి వివరాలను పౌరసరఫరాల శాఖ..అన్ని జిల్లాల కలెక్టర్లు పంపించి.. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా.. 78,842 రేషన్ కార్డుల్లో ఉన్నా అనర్హులను గుర్తించి త్వరలోనే వారి కార్డులను రద్దు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే పైన తెలిపిన 78,842 రేషర్ కార్డుల్లో అత్యధికంగా నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.