Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకుల జూనియర్‌ కాలేజీల్లో 97 శాతం మంది ఉత్తీర్ణత

గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 97 శాతం మంది ఉత్తీర్ణత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీలు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో 97 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది 2,457 మంది పరీక్షలు రాయగా 2,384 మంది ఉత్తీర్ణులయ్యారు. 30 మందికి పైగా ఎంపీసీలో, 22 మంది బైపీసీ గ్రూపులో 990కి పైగా మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థులు 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. అంకిత భావంతో పని చేసిన అధ్యాపకులను, అత్యధిక మార్కులు సాధించి సంస్థను మొదటి స్థానంలో నిలబెట్టిన విద్యార్థులకు రమణ కుమార్‌ అభినందనలు తెలిపారు.
గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో 10 కాలేజీల్లో వంద శాతం ఫలితాలు
గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 10 కాలేజీల్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. ఈ మేరకు ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 6,535 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 5,653 మంది (86.05) శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ సెకెండియర్‌లో విస్లావత్‌ నందిని (992 మార్కులు), ఎ.వెన్నల (990 మార్కులు), బైపీసీలో దరావత్‌ గణేష్‌ (991), లున్సావత్‌ సుప్రియ (990), రత్లావత్‌ రాగిణి (990), సీఈసీలో బోడ శివ జ్యోతిక (970), హెచ్‌ఈసీలో అనుపోతుల శివలింగం (972), ఎంఈసీలో కేళావత్‌ అనిత (936 మార్కులు) సాధించారు. వారు సాధించిన విజయం పట్ల రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తదితరులు అభినందించారు.
మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ ఇ.శృతిలయకు 994 మార్కులు
ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్స్‌ విద్యార్థులు పలువురు సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మోడల్‌ స్కూల్‌ సెకెండియర్‌ విద్యార్థినీ ఇ.శృతిలయ (ఎంపీసీ) 994 మార్కులతో టాపర్‌గా నిలిచారు. నల్లగొండ జిల్లా బోతపాలెం మోడల్‌ స్కూల్‌ విద్యార్తినీ పి.సౌశీల్య రాణి (బైపీసీ) 988, చేవెళ్ల మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ కె.భార్గవి (ఎంఈసీ)కి 978, సీఈసీలో కరీంనగర్‌ జిల్లా రామడుగు స్కూల్‌ విద్యార్థినీ బి.శ్రీజ, పోచంపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ పి.అంజలికి 983 మార్కుల చొప్పున వచ్చాయి. మొదటి సంవత్సరంలో మంచిర్యాల మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ డి.రిశ్విత (ఎంపీసీ) 468 మార్కులు, యాదాద్రి జిల్లా పోచంపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ డి.హారిక (బైపీసీ) 438 మార్కులు, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ జి.శ్రావణి (ఎంఈసీ), కొత్తబాద్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని సుమలత (సీఈసీ) 489 మార్కులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్‌ స్కూల్స్‌ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 17,749 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 9,213 మంది (51.91 శాతం), రెండవ సంవత్సరం పరీక్షలకు 16,893 మంది హాజరు కాగా వారిలో 11,174 మంది (66.15 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -