నవతెలంగాణ-హైదరాబాద్: పాక్ -భారత్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలువురు భిన్నమైన ప్రశ్నలు లెవనెత్తున్నారు. ఈక్రమంలో మాజీ భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధమంటే రొమాంటిక్ వ్యవహారం కాదని, అదొక బాలీవుడ్ సినిమా అసలే కాదని స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.పుణెలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ నరవణె ప్రసంగిస్తూ …. ”యుద్ధం లేదా హింస అనేవి మనం ఆశ్రయించాల్సిన చివరి మార్గాలు కావాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా పిల్లలు పడే ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. ”షెల్లింగ్ జరిగినప్పుడు, రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి రావడం వంటి భయానక దృశ్యాలు చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధ తరతరాలు వెంటాడుతుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) బారిన పడిన వారు, భయంకరమైన ఘటనలు చూసిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా చెమటలతో నిద్రలేచి, మానసిక చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల మధ్యే కాకుండా, కుటుంబాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కూడా విభేదాలను హింస ద్వారా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ”జాతీయ భద్రతలో మనమందరం సమాన భాగస్వాములం. హింస దేనికీ సమాధానం కాదు” అని నరవణె ఉద్ఘాటించారు.
యుద్ధమంటే బాలీవుట్ మూవీలో రొమాంటిక్ సన్నివేశం కాదు: నరవణె
- Advertisement -
- Advertisement -