నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ భారీ బాంబు బయటపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశ్వభారతి యూనివర్సిటీకి సమీపంలోని బోల్పూర్ వద్ద ఉన్న లౌదహా గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. దాదాపు 80 ఏళ్లుగా భూమిలో ఉన్న ఈ బాంబును సైన్యం సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే… సుమారు నెల రోజుల క్రితం అజయ్ నది ఒడ్డున స్థానిక జాలర్లకు సిలిండర్ ఆకారంలో ఉన్న ఓ పాత లోహపు వస్తువు కనిపించింది. మొదట దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని, ప్రజలు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆర్మీ అధికారులకు విషయం తెలియజేశారు. బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ బాంబ్ స్క్వాడ్, దానిని రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుగా గుర్తించింది. అత్యంత జాగ్రత్తగా, నియంత్రిత పద్ధతిలో బాంబును పేల్చివేయగా, ఆ ధాటికి సమీప గ్రామాలు సైతం కంపించాయని స్థానికులు తెలిపారు. ఎనభై ఏళ్లు దాటినా బాంబు ఇంకా పేలుడు సామర్థ్యంతో ఉండటం ఆశ్చర్యం కలిగించింది.