నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) తమిళనాడులోనూ నిర్వహించనున్నారు. ఒక వారంలో ఎస్ఐఆర్ (SIR) ప్రారంభం అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బిహార్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. ఎస్ఐఆర్ పేరుతో బిహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తోందని ఆ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడిన సంగతి తెలిసిందే.



