Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంలింగనిష్పత్తిలో కేరళ ఆదర్శం

లింగనిష్పత్తిలో కేరళ ఆదర్శం

- Advertisement -

ఇతర రాష్ట్రాలు ఈ మార్గాన్ని అనుసరించాలి
కొచ్చిలోని సెయింట్‌ థెరిసా శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరువనంతపురం : దేశంలోనే కేరళ రాష్ట్రం అత్యంత ఆదర్శవంతమైన లింగ నిష్పత్తిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. దశాబ్దకాలంలో లింగ ఆధారిత బడ్జెట్‌ కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయని అన్నారు. 2011 నుంచి 2024 మధ్య మహిళల నేతృత్వంలో ఎంఎస్‌ఎంఈలు దాదాపు రెట్టింపయ్యాయని తెలిపారు. కొచ్చిలోని సెయింట్‌ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముర్ము శుక్ర వారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు తమ అభిరుచిని, సామర్థ్యాలను వ్యక్తికరించడానికి అనువైన మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మహిళా నేతల నేతృత్వంలోని సమాజం మరింత సమర్థవంతంగా పనిచేస్తూనే, మరింత మానవీయంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మహిళలు స్పష్టతతో, ధైర్యంతో శ్రేష్టమైన జీవితాన్ని ఎంచుకోవాలని అన్నారు. ఆధ్యాత్మిక విలువలకు దృఢ నిబద్ధతతో మహిళా విద్యను ప్రోత్సహిస్తున్న కళాశాల సామాజిక పరివర్తన , జాతీయ నిర్మాణానికి గొప్ప కృషి చేసిందని అన్నారు.

ఈ సంస్థను నిర్మించిన, శతాబ్దాల పాటు నిరంతర విజయాలు సాధించేందుకు నేతృత్వం వహించిన విశిష్ట వ్యక్తుల దార్శనికత, వారసత్వం ప్రశంసనీయమని కొనియాడారు. కేరళకు చెందిన పలువురు మహిళలు దేశానికి నాయకత్వం వహించారని అన్నారు. 15మంది అసాధారణ మహిళా సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణంలో గొప్ప దృక్పథాలను జోడించారని తెలిపారు. ఆ 15మందిలో ముగ్గురు కేరళకు చెందిన వారేనని అన్నారు. అమ్ము స్వామినాథన్‌, అన్నీ మస్కరీన్‌, దాక్షాయణి వేలాయుదన్‌ ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం , లింగ సమానత్వంతో పాటు అనేక ఇతర ముఖ్య అంశాలపై చర్చలను ప్రభావితం చేశారని చెప్పారు. కేరళ మహిళలు సమర్థతకు గొప్ప ఉదాహరణగా నిలిచారని అన్నారు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా జస్టిస్‌ అన్నాచాందీ. 1956లో ఆమె కేరళ హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారని తెలిపారు. 1989లో భారత సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జీగా జస్టిస్‌ ఎం.ఫాతిమా బీవి చరిత్ర సృష్టించారని అన్నారు. అంతకుముందు కళాశాల శతాబ్ది ఉత్సవాల లోగోను రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి సహా మంత్రులు పి.రాజీవ్‌, వి.ఎన్‌.వాసవన్‌, ఎంపీ హిబిఈడెన్‌, ఎమ్మెల్యే టి.జె.వినోద్‌, కాలేజీ ప్రిన్సిపల్‌ అనుజోసెఫ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -