ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు అందించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. గత యూపీఏ ప్రభుత్వం తెలంగాణలో 194 మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయగా అందులో 3 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీలుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరి కోసం ప్రత్యేక సొసైటీ నిర్వహణ రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారంగా మారుతుందని చెప్పారు. 
మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్న 010 ఫైల్పై త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. అదేవిధంగా ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల డిఏ బకాయిలు వెంటనే చేయించాలని కోరారు.
ఆర్థికభారం లేకుంటే కచ్చితంగా నిర్ణయం
010 పద్దు ప్రకటన ఆర్థిక భారం లేనిదైతే కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్టు పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. అదే విధంగా దశలవారీ పెండింగ్ బిల్లుల చెల్లింపును కూడా వేగవంతం చేస్తామని చెప్పినట్టు వెల్లడించారు.ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల తరుపున ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్ డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

                                    

