ఎవరి అనుమతితో మిమ్మల్ని అరెస్టు చేశారు?
సీఎం రేవంత్రెడ్డికి ఎంపీ రఘునందన్రావు ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి ఎందుకని బీజేపీ ఎంపీ రఘునందన్రావు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుంది? ఈ దేశం, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే అరెస్టు కాలేదా? అని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పాలనలో మిమ్మల్ని రెండు సార్లు అరెస్టు చేశారు. నాడు కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకుని అరెస్టు చేశారు’ అని ప్రశ్నించారు. కేటీఆర్ అరెస్టు విషయంలో రేవంత్రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దంటూ ఏఐసీసీ పెద్దలు చేసిన సూచన మేరకే వారిని అరెస్టు చేయకుండా అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హడావుడిగా అసెంబ్లీలో పెట్టి ఈ కేసును సీబీఐకి పంపితే దీనిపై కేసీఆర్, హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్.కే జోష్, స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దాంతో వీరందరిపై సీబీఐ విచారణ ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. మరో రెండు వారాల్లో ఏజీతో కౌంటర్ వేయాలని చెబితే ఇప్పటి వరకు కౌంటర్ వేయించలేదని విమర్శించారు. ఏసీబీ కేసులో అరెస్టు చేయించడం సీఎంకు చేతకావడం లేదన్నారు. 50సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి కేసీఆర్ కుటుంబం అవినీతిపై ప్రధానికో, కేంద్ర హోంమంత్రికో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అజహరుద్దీన్కు మంత్రి పదవి బీసీ కోటాలో ఇచ్చారా? లేక మైనార్టీ కోటాలో ఇచ్చారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతిపై ఆధారాలుంటే గవర్నర్ అనుమతి ఎందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



