నవతెలంగాణ – ఆత్మకూరు
బాల్య వివాహాలు చెస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. హనుమకొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఆత్మకూరు మండలంలోని కొత్తగట్టు గ్రామంలో బుధవారం అధికారులు నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం, బాలల సంరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీ రాజు అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ బాలల సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశంలో బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ముఖ్య ఉద్దేశం వివరించడంతో పాటు, బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రుల నుండి హామీ పత్రాలు స్వీకరించారు. బాల్య వివాహం జరిపితే ఏడాది జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారని అధికారులు హెచ్చరించారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరగాలని సూచించారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఆడపిల్లల రక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఐసి డిఎస్ సూపర్వైజర్ నసీంపర్విన్, డిహెచ్ఇడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ స్వర్ణలత, బాలల పరిరక్షణ విభాగం ఔట్ టీచ్ వర్కర్ విజయ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ రమేష్, షేర్ ఎన్జీవో ప్రతినిధి జ్ఞానేశ్వరి, గురువులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



