స్నిపర్ టీం కమాండర్ మద్వి దేవాతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని భేజ్జి చింతగుఫా పోలీస్ స్టేషన్ల సరిహద్దులో ఉన్న తుమ్మలపాడ్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హతమార్చారు. స్నిపర్ టీం కమాండర్ మద్విదేవా ఈ ఎన్కౌంటర్లో మరణించాడు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ అకాన్ష్రావు గిరిపుంజే హత్యకు కుట్ర పన్నిన అపఖ్యాతి పాలైన మావోయిస్టు మద్విదేవాను తుమల్పాడ్ అడవులలో జరిగిన ఎన్కౌంటర్లో డిఆర్జి బృందం హతమార్చిందని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ప్రకటించారు. సంఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు పత్రాలు, 303 రైఫిల్ బిజిఎల్ లాంచర్తో సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. సుక్మా జిల్లాలోని భేజ్జీ చింతగుఫా పోలీస్ స్టేషన్ల సరిహద్దులో ఉన్న తుమ్మలపాడ్లోని దట్టమైన అడవి కొండ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత డీఆర్జీ బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని ఎస్పీ తెలిపారు. ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్లో ముగ్గురు మావోయిస్టులను చంపినట్టు తెలిపారు.
సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ప్రాథమిక గుర్తింపు ఆధారంగా చనిపోయిన ముగ్గురు మావోయిస్టు కార్యకర్తలను గుర్తించారు. స్నిపర్ టీమ్ కమాండర్ మాద్వి దేవాపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. సీఎన్ఎం కమాండర్ పోడియం గంగి రూ.5 లక్షలు, సుక్మా జిల్లా పెద్దపాడు నివాసి. రూ.5 లక్షల రివార్డుతో ఏరియా కమిటీ సభ్యురాలు సోడి గంగి, సుక్మా జిల్లా కిష్టారాం పోలీస్ స్టేషన్లోని వర్మగుండు నివాసిగా పోలీసులు గుర్తించారు. బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ పట్టలింగం మాట్లాడుతూ… ”బస్తర్లో మావోయిజం తుది శ్వాస విడిచింది. ఆ సంస్థ నిర్మాణం విచ్ఛిన్నమైంది. క్రియాశీల మావోయిస్టులందరూ హింసను విడిచిపెట్టి, ప్రభుత్వ లొంగుబాటు పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి ‘ అని తెలిపారు. భద్రతా దళాల ఉమ్మడి కార్యకలాపాల ఫలితంగా 2025లో ఇప్పటివరకూ కేంద్ర కమిటీ సభ్యులు, డీకేఎస్జెడ్సీ సభ్యులు పీఎల్జీఏ కార్డ్ హౌల్డర్లు సహా మొత్తం 233 మంది మావోయిస్టులు హతమయ్యారని అన్నారు. డీఆర్జీ బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్ ఇతర దళాలు ఈ ప్రాంతంలో విస్తృతమైన సోదాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.



