పాట్నా : బీహార్ శాసనసభ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన విజేతల సంఖ్య తక్కువేమీ లేదు. జయాపజయాల మధ్య వందల ఓట్ల తేడా మాత్రమే ఉండడం గమనార్హం. మూడు స్థానాలలో విజేతలకు వచ్చిన మెజారిటీ వంద ఓట్ల లోపే ఉంది. మరో మూడు స్థానాలలో విజేతలకు వచ్చిన మెజారిటీ 250 ఓట్ల కంటే తక్కువగా ఉంది. భోజ్పూర్ జిల్లాలోని సందేశ్ స్థానంలో జేడీయూ, ఆర్జేడీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరిగింది. చివరికి జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ షా 27 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. అర్రాలోని అజియాన్ స్థానంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి శివ ప్రకాష్ రంజన్కు 95 ఓట్లతో విజయం చేజారింది. రామ్ఘర్ శాసనసభ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి సతీశ్ కుమార్ సింగ్ యాదవ్కు వచ్చిన మెజారిటీ 30 ఓట్లు మాత్రమే.నబీనగర్లో జేడీయూ అభ్యర్థి చేతన్ ఆనంద్ 112 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థిపై గెలుపొందారు. ఢాకా స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి ఫైజల్ రెహమాన్కు వచ్చిన ఆధిక్యత 178 ఓట్లు. ఫర్బేస్గంజ్ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్కు వచ్చిన మెజారిటీ 221 ఓట్లు. జెహనాబాద్, బోధ్ గయ స్థానాలలో ఆర్జేడీ అభ్యర్థులకు వెయ్యి ఓట్ల లోపు మెజారిటీ వచ్చింది. ఎల్జేపీ (రాం విలాస్)కి చెందిన ఇద్దరు అభ్యర్థులకు కూడా వెయ్యి ఓట్ల లోపే మెజారిటీ వచ్చింది.



