నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం వైట్హౌజ్ ఓవల్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది. మా మధ్య భేటీ చాలా గొప్పగా జరిగింది అంటూ మమ్దానీ పక్కన నిల్చుని ఉండగా తన డెస్క్ మీద కూర్చుని ట్రంప్ ప్రకటన చేశారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించాం. మనం ఇద్దరం న్యూయార్క్ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం అని అన్నారు. మమ్దానీ కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు వ్యాఖ్యానించారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగినట్లు ప్రకటించాడు.
భేటీ జరగడానికి కొన్ని గంటల ముందు కూడా.. ‘‘మా దారులు వేరైనా.. మా లక్ష్యం మాత్రం ఒక్కటే. బలమైన న్యూయార్క్ను నిర్మించాలని కోరుకుంటున్నాం. అతడిది భిన్నమైన ఫిలాసఫీ. నాతో పోలిస్తే భిన్నమైంది. అతడి పోరాటాన్ని అభినందిస్తా. ఇలాంటి ప్రయాణం అంత సులభం కాదు. కానీ, అతడు విజయవంతమయ్యాడు. ఇక నుంచి మేమిద్దరం బాగానే ఉంటామని అనుకుంటున్నా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఉగాండాలో పుట్టారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ల సంతానం ఈయన. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా చరిత్ర సృష్టించారు. సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న మమ్దానీ.. ప్రచారంలోనూ వైవిధ్యతను కనబరిచి ఓటర్లను ఆకట్టుకోగలిగారు. మమ్దానీ తన మేయర్ పదవిని జనవరి 1న స్వీకరించనున్నారు.



