బీసీలకు 42 శాతం సీట్లు ఎలా ఇస్తారు : మాజీమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండదనీ, అప్పుడు బీసీలకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని మాజీ మంత్రి తలసారి శ్రీనివాసయాదవ్ సీఎంను ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్, రాజారామ్ యాదవ్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ద రామయ్య వంటి పెద్దల సమక్షంలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 23శాతం కూడా రాకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచి ఇవ్వాలంటే, ట్రిపుల్ టెస్టును పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు చెప్పిన మాటను రేవంత్ పెడచెవి పెట్టారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్లను పొందుపరచాలనే కనీసం ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. కొన్ని పెయిడ్ బ్యాచ్లతో పూలమాలలు వేయించుకుని పాలాభిషేకాలు చేపించుకున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



