14న రాస్తారోకోకు అనుమతించండి సీఈవో, డీజీపీకి అఖిలపక్షం వినతి

Allow me to write on the 14th
Akhilapaksam petition to CEO DGPనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌పీయస్సీ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ, అమ్మకం వ్యవహారాలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల పక్షం డిమాండ్‌ చేసింది. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌తో పాటు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
టీయస్‌పీయస్సీ నిర్వహించిన గ్రూప్‌ వన్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. 16 పరీక్షాపత్రాలు లీక్‌ కావడమే కాకుండా వాటిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, సీపీఐ (ఎం), తెలంగాణ జన సమితి , బీయస్పీ, సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమెక్రసీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీలు అక్టోబర్‌ 14న రాస్తారోకో తలపెట్టాయని చెప్పారు. రామగుండం-హైదరాబాద్‌, ఖమ్మం-హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌, వరంగల్‌-హైదరాబాద్‌ రహదారిలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాస్తారోకో నిర్వహించేందుకు అనుమతించాలని వారు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మల్లు రవి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రస్తుత బోర్డు చైర్మెన్‌తో సహా సభ్యులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలనీ, కమిషన్ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరారు. డీయస్సీ పోస్టుల సంఖ్యను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500కు పెంచాలని (బ్యాక్‌లాగ్‌ పోస్టులు కాకుండా అదనంగా) డిమాండ్‌ చేశారు. పరీక్షల రద్దుకు కమిషన్‌ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love