నవతెలంగాణ-హైదరాబాద్ : జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్బాబు మీడియాకు వెల్లడించారు. పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంతేకాకుండా మరో డిస్కమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

క్యాబినెట్ నిర్ణయాలు
- – 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు
- – పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానం
- – కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు అనుమతి
- – ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
- – పాల్వంచ, మక్తల్లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలపై పరిశీలన
- – హైదరాబాద్ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు
- – భూగర్భ విద్యుత్ వ్యవస్థతోపాటు టీఫైబర్ కేబుళ్ల ఏర్పాటు
- – భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపు
- – ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్కు 40 ఎకరాలు కేటాయింపు
- – జూబ్లీహిల్స్తోపాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు



