ఈ బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడే
ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో చట్టం ప్రతుల దహనం
30, 31తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరసనలు
నవతెలంగాణ – ముషీరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వికసిత్ భారత్ – రోజ్గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకం 2025 (వీబీ జీరాం జీ) వికలాంగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిని రద్దు చేసేవరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ర ్టఅధ్యక్షులు కె. వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య అన్నారు. ఆదివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద వీబీ -జీ రామ్-జీ చట్టం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులకు ఉపాధి హామీ చట్టం ద్వారా 150 రోజులు కల్పించేందుకు ఈ చట్టం వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ చట్టం కింద ఉపాధి కల్పించారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. పేరు మార్చి వికలాంగులకు పని దొరకని పరిస్థితిని కల్పించారన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగుల జీవనోపాధి, గౌరవం, మనుగడకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులకు అందుబాటులో ఉండే పని కూడా దొరికే అవకాశం లేదన్నారు. వికలాంగుల జీవనోపాధిని దెబ్బతిసేలా ఉన్న వీబీ జీ రామ్ జీ చట్టం పత్రాలను ఈ నెల 30, 31తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు ఉపేందర్, కాషాప్ప, మధుబాబు, అరిఫా, సహాయ కార్యదర్శులు జెర్కొని రాజు, నాగలక్ష్మి, బాలిశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కవిత, బాలయ్య, భుజంగారెడ్డి, చంద్రమోహన్, చందు, భాగ్యలక్ష్మి, షైన్ బేగం, ప్రకాష్, లలిత, దుర్గ, కుర్మయ్య, పార్వతి తదితరులు పాల్గొన్నారు.



