నవతెలంగాణ-హైదరాబాద్: మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక అర్ధాకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలం కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికులను క్షేత్రస్థాయికి ఉన్నతాధికారులు పరిశీలించాలని, అప్పడే వారి బాధలు తెలుస్తాయని, కార్మికుల కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయని అన్నారు. పని ప్రదేశంలో కనీసం తాగునీరు అందుబాబులో లేదని, జైకేసారంతో పాటు జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాల్లో త్రాగునీరు అందించడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకొని ఉదయం పూట మాత్రమే పనులు పెట్టి, రెండు పూటల ఫోటో విధానాన్ని రద్దుచేసి, పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించి, పనిముట్లు ఇచ్చి , 200 రోజుల పని దినాలతో పాటు రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి రక్షణ కోసం, 2005 లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, నూతన జిరాంజీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మే 15న దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కార్మికుల సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల సహాయ కార్యదర్శి పొట్ట వెంకటయ్య, రైతు సంఘం నాయకులు పొట్ట శ్రీను, గ్రామ ఉప సర్పంచ్ బోదాస్ వెంకటేష్, మండల నాయకులు చాపల మారయ్య, కార్మికులు తూర్పుంటి మైసమ్మ, అంతటి ప్రభావతి, లతా, బొంతల అండాలు, అలివేల, గంగాదేవి లచ్చమ్మ, పద్మ, మోతే అండాలు, నక్క యాదమ్మ, దొడ్డి లక్ష్మి, ఎడ్ల లక్ష్మమ్మ, రాగీరు వెంకటమ్మ, ఆలకుంట్ల ఎల్లయ్య, లోకసాని రామిరెడ్డి, కోనపురి నరసింహ, ఎడ్ల లక్ష్మమ్మ, గండికోట గంగమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.



