నవతెలంగాణ- రాయపోల్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ పదవ తరగతి 2005-2006 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం రాయపోల్ మండల కేంద్రం జిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము రాయపోల్ గ్రామంలో పదవ తరగతి పూర్తయిన తర్వాత మళ్లీ 20 సంవత్సరాల తరువాత ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మేము ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి మా గురువులే కారణమని తల్లి, తండ్రి తరువాత ఎవరైనా గురువులను గౌరవించాలన్నారు. త్రిమూర్తులు అంటే తల్లి, తండ్రి, గురువు అన్నారు. మేము గురుదక్షణ కింద వారికి ఏమిచ్చినా కాని వారు రుణం తీర్చుకోలేమని తెలిపారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కత్తిపోటు తప్పిన గాని కలంపోటు తప్పదన్నారు. ఒక చిన్న అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ దేశ అత్యున్నత పదవి అయిన ప్రధాని, రాష్ట్రపతి వరకు ఎవరైనా పాఠశాలకు వెళ్లకుండా గురువుల చేత విద్య బుద్ధులు అభ్యసించకుండా సాధించలేమన్నారు.
ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని అలాంటి గొప్ప ఉపాధ్యాయులు మాకు దొరకడం ఎంతో అదృష్టమని అన్నారు. మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే మేము ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి మా గురువులే కారణమన్నారు. జీవితాంతం మా గురువులకు రుణపడి ఉంటామని వారిని ఎల్లవేళలా గుర్తించుకుంటామని తెలియజేశారు. అలాగే గురువులు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు తమ కంటే ఉన్నత స్థాయికి ఎదిగితే దానికి మించిన గురుదక్షిణ లేదన్నారు. విద్యార్థులదరూ గొప్ప స్థాయికి ఎదిగి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు కుకునూరు పల్లి ఎంఈఓ బి. సత్తయ్య, పాములపర్తి ప్రధానోపాధ్యాయులు షేక్ లతీఫ్ సైదా, జాలిగామ ప్రధానోపాధ్యాయులు టి.బసవరాజ్ , రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు ఏ.మల్లారెడ్డి, 2005- 2006 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



