Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుధరణి, భూభారతి కుంభకోణంలో 15మంది అరెస్ట్‌

ధరణి, భూభారతి కుంభకోణంలో 15మంది అరెస్ట్‌

- Advertisement -

పరారీలో మరో 9మంది.. వివరాలు వెల్లడించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండీ కొట్టిన మొత్తం ముఠాలోని 15మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ. లక్ష, సుమారు రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పసునూరి బసవ రాజు, జిల్లా, జెల్లా పాండు, గణేష్‌ కుమార్‌, గజులపాటి శ్రీనాథ్‌, యెనగంధుల వెంకటేశ్‌, కోదురి శ్రవణ్‌, కొలిపాక సతీష్‌ కుమార్‌, తడూరి రంజిత్‌ కుమార్‌, దుంపల కిషన్‌ రెడ్డి, దశరథ మేఘావత్‌, నారా భాను ప్రసాద్‌, గొపగాను శ్రీనాథ్‌, ఒగ్గు కర్నాకర్‌, కమల్ల శివ కుమార్‌, అలేటి నాగరాజు ఉన్నారు.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఆన్‌లైన్‌ సర్వీస్‌ నిర్వహించేవారు. నిందితుల్లో ఒకడైన గణేష్‌ తనకు తాను ఆన్‌లైన్‌ సెంటర్ల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని చెల్లించాల్సిన మొత్తాన్ని ఏన్‌.ఆర్‌.ఐ ఖాతా ద్వారా పే చేస్తానని చెప్పి రైతుల నుంచి మొత్తం డబ్బులను మీ సేవా వ్యక్తుల ద్వారా వసూలు చేయించి ఆ వసూలు చేసిన డబ్బుల నుంచి ఆన్‌లైన్‌ సర్వీస్‌ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమీషన్‌ చొప్పున డబ్బు అందజేస్తూ ఇ చాలాన్లను ప్రధాన నిందితుడుకి పంపించేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణీ/భూభారతి వైబ్‌సైట్లో ఇన్‌ స్పెక్ట్‌ ఎడిట్‌ అప్లికేషన్‌ ఉపయోగించి చలాన్‌ రుసుము తగ్గించేవాడు. మొబైల్‌ ద్వారా ఎడిట్‌ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. ఇదే క్రమంలో నిందితులు మొబైల్‌ ఆప్లికేషన్‌ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించి వెబ్‌సైట్‌లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసేవాడు.

మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి నకిలీ చలాన్లను స్థానిక ఎంఆర్‌ఓ/ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్‌ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్‌ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్‌ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగతా వారికి పది శాతం నుంచి 30శాతం వరకు కమిషన్‌ చెల్లించేవారు. ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదైనట్టు వరంగల్‌ సీపీ వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏఎస్పీ పండరి చేతన్‌, జనగామ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారయణ రెడ్డి, రఘునాథ్‌ పల్లి సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బందిని సీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -