నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన మంత్రివర్గంలోకి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నితీష్కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ చోటు దక్కించుకున్నారు. నిశాంత్తోపాటు 32 మంది నేడు మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం పాట్నాలో గాంధీ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జెడియు అధ్యక్షులు నితీష్కుమార్తోపాటు పలువురు ఎన్డిఎ నేతలు పాల్గొన్నారు.
కాగా, కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో సహా బిజెపికి 15 మంత్రి పదవులు, ఇక మిత్రపక్ష పార్టీ జెడియుకి 13 (ఇద్దరు డిప్యూటీ సిఎంలు : బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరి), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) : ఇద్దరు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) : ఒకరు, రాష్ట్రీయ లోక్ మోర్చా నుండి ఒకరు మంత్రులుగా గురువారం ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో ఓబిసి, ఇబిసి, హిందువులు, దళితులు, మహిళలు ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందినవారికి కేబినెట్లో స్థానం కల్పించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో 35 మందితో కూడిన మంత్రివర్గం ఉంది.



