ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
నవతెలంగాణ – ముధోల్
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోత్తరంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వసంత పంచమి పర్వదినానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేస్తామని వివరించారు. రూ.200 కోట్లతో బాసర అభివృద్ధికై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.



