- Advertisement -
- దళిత వ్యక్తి ఆస్తికి రక్షణ లేదు
– మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ, కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు
నవతెలంగాణ – ఆర్మూర్ - తన ఆస్తిని ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ మండలానికి చెందిన బాధితుడు మాజీ ఎంపిపి పస్క నర్సయ్య శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని మచ్చర్ల గ్రామంలో డిసెంబర్ 13, 2025 అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో, పార్కింగ్ చేసిన కారు (నెం. టీఎస్ 16 ఈ డబ్ల్యు. 2890) ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి పూర్తిగా తగలబెట్టారని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఎఫ్.ఐ.ఆర్ నమోదై ఇన్ని రోజులవుతున్నా నిందితులను గుర్తించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఒక దళిత వ్యక్తిగా తన ఆస్తికి రక్షణ కల్పించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో స్థానిక యంత్రాంగం విఫలమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కారుకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పోలీసు విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
- Advertisement -



