ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్
నవతెలంగాణ – ఆలేరు టౌను
భారత ప్రధాన న్యాయమూర్తి (సీ జే ఐ) భారతదేశంలో కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు, మూలధన వర్గాలు ప్రచారం చేస్తున్న ఆధార రహిత వాదనలను పునరావృతం చేయడంపై ఇఫ్ట్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలేరు పట్టణంలో శనివారం రైల్వే గేట్ ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సమావేశం, జిల్లా అద్యక్షులు పద్మ సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధికి, మందగమనానికి ట్రేడ్ యూనియన్లే కారణమన్న ప్రచారాన్ని సీజేఐ స్వయంగా ప్రస్తావించడం తీవ్రమైన విషయంగా ఐ ఎఫ్ టి యు భావిస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాక, నిరుద్యోగాన్ని కారణంగా చూపుతూ కనీస వేతనాలను అవసరం లేనివిగా పరిగణించడం మరింత ఆందోళనకరమైనదిగా, ఊహించలేనిదిగా ఉందనిఅన్నారు. ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో భారత కార్మిక వర్గ ఉద్యమాలు సాగించిన పోరాటాల వల్లనే రాజ్యాంగంలో పొందుపరిచన మౌలిక హక్కులలో ఒకటైన సంఘటితమయ్యే హక్కు వంటి హక్కులు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించి, అమలు చేయాల్సిన బాధ్యత సీజేఐకూ, సుప్రీంకోర్టుకూ ఉందని చెప్పారు. కార్మిక ఉద్యమాల, పోరాటాల వత్తిడితోనే చట్టబద్ధమైన వేతనాలు, సంక్షేమ హక్కులు సాధించుకున్నామని తెలియజేశారు. పారిశ్రామిక విపత్తు చోటుచేసుకుందని, వందలాది, వేలాది కార్మికుల ప్రాణాలు బలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నాలుగు కార్మిక చట్టాల (లేబర్ కోడ్స్) ద్వారా కష్టపడి సాధించుకున్న హక్కుల కొరకు, ఫిబ్రవరి 12 న దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక వర్గ సార్వత్రిక సమ్మె ను దేశ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్,జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, కల్లెపు చంద్రయ్య, యెలగందుల సిద్దులు, ఊరడి రామచంద్రు, బుషె శ్రీశైలం,కుర్రి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.



